• అత్యవసర పరిస్థితుల్లో రక్తం ప్రాణాలను కాపాడుతుంది
• రక్తదాన శిబిరాల దగ్గర సామాజిక దూరం పాటించాలి
• మాజి ఎంపి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేసి రక్తం అవసరం ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా రక్తదానం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కవిత తన నివాసంలో రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతులు, యువకులు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలు కాపాడుతుందని ఆమె చెప్పారు. తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు తమవంతు సహాయం అందించేందుకు రక్త దానం చేసినట్లు తెలిపారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే టిఆర్ఎస్ కార్యకర్తలు వీలైనంతగా ఎక్కువగా రక్తదానం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భవ దినోత్సవం నుంచి వారంరోజుల పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేయాలని ఆమె సూచించారు. అయితే శిబిరాల వద్ద సామాజిక దూరం, కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని కవిత విజ్ఞప్తి చేశారు.