90శాతం వడ్దీ మాఫీతో చెల్లించేందుకు వెసులుబాటు
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15వరకు వన్ టైమ్ అమ్నెస్టీ స్కీమ్ అమలు
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త. 201920 ఆర్థ్ధిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతం మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో 5.64 లక్షల ఆస్తులకు సంబంధించి రూ.1477.86 కోట్లు బకాయిలుండగా, ఇందుకు సంబంధించి రూ.1017.76 కోట్లు వడ్డీ అయింది. దీంతో పాత బకాయిలను వసూళ్లు చేసేందుకు వన్ టైమ్ అమ్నెస్టీ స్కీమ్ కింద ఆస్తు పన్నులపై బకాయి వడ్దీలో 90 శాతం మాఫీ చేయాలని కోరుతూ ఇటీవలే జిహెచ్ఎంసి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పథకం ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉండనుందని ఉత్తర్వులో పేర్కొంది. ఆస్తిపన్ను బకాయిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిహెచ్ఎంసి అధికారులు కోరారు.