Sunday, April 28, 2024

టిఎస్ ఆర్టీసి ఉద్యోగులకు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

Good news for TSRTC employees

మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పెరిగిన కార్మికులకు కరువు భత్యం
వచ్చే వేతనాల నుంచి 5 శాతం డిఏ చెల్లించనున్నట్ట ఆర్టీసి ప్రకటన

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఉద్యోగులకు గుడ్‌న్యూస్. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కార్మికులకు కరువు భత్యం పెరిగింది. పెరిగిన డిఏను వచ్చే వేతనాల నుంచి కార్మికులు అందుకుంటారని, అందులో భాగంగా 5 శాతం డిఏను చెల్లించనున్నట్టు ఆర్టీసి యాజమాన్యం ప్రకటించింది. మూలవేతనంపై ఐదు శాతం అంటే డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యంలో కలవనుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500ల వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డిఏ ప్రకటనతో ఆర్టీసిపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్ దెబ్బతో ఆర్టీసి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో డిఏల చెల్లింపు ఆగిపోయింది. ఆర్టీసిలో పనిచేస్తున్న 48 వేల మందితో పాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ డిఏ వర్తిస్తుందని ఆర్టీసి ప్రకటించింది. ఆరు డిఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని, వెంటనే చెల్లించాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా డిఏ పెంపుపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ బకాయిల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత డిఏ పెంచడం కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటేనని అయితే పెండింగ్ డిఏల ప్రకారం ఇవ్వాలని, ఏరియర్స్ చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News