Friday, April 26, 2024

హరిత వాయువులు, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి ఇంధనం

- Advertisement -
- Advertisement -

భూగోళ పర్యావరణ సమస్యలుగా పట్టి పీడిస్తున్న హరితవాయువులు, ప్లాస్టిక్ వ్యర్ధాలు వంటి వాటిని పరిష్కరించే మార్గాలను ఇద్దరు భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన మోతియార్ రెహ్మాన్, శుభజిత్ భట్టాచార్జి అనే భారతీయ శాస్త్రవేత్తలు ఈ సమస్యలను పరిష్కరించగల సమర్ధ వ్యవస్థను రూపొందించారు. ప్రొఫెసర్ ఇర్విన్ రెయిస్నెర్ పర్యవేక్షణలో రెయిస్నెర్ ల్యాబ్‌లో సాంకేతిక వ్యవస్థను తయారు చేశారు.

ఇందులోని రియాక్టర్ హరితవాయువులను, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగపడే ఇంధనాలుగా, ఇతర ఉత్పత్తులుగా మార్చ గలుగుతుంది. కేవలం సౌర విద్యుత్ ఆధారం గానే పనిచేసే రియాక్టర్ పెరోవ్‌స్కైట్ ఆధారమైన లైట్ అబ్జర్వర్‌ను వినియోగిస్తుంది. సోలార్ సెల్స్‌ను తయారు చేయడానికి సిలికాన్‌కు బదులుగా సమంజసమైన ధరలో పెరోవ్‌స్కైట్ లభిస్తుంది. పెరోవ్‌స్కైట్ అంటే కేల్షియం టిటానియం ఆక్సైడ్‌తో కూడిన ఖనిజం.

ఇందులో కేల్షియం టిటనేట్ అనే మూలకం ఉంటుంది. ఈ ఖనిజాన్ని 1839లో రష్యాలోని యూరల్ పర్వతాల్లో కనుగొన్నారు. రియాక్టర్‌లో రెండు గదులు ఉంటాయి. ఒకటి కార్బన్‌డైయాక్సైడ్‌ను మార్చగలుగుతుంది. రెండోది ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తుందని మోతియార్ రెహ్మాన్ చెప్పారు. కార్బన్‌డైయాక్సైడ్‌ను, ప్లాస్టిక్ వ్యర్ధాలను మార్చడం ద్వారా ఫార్మిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ వంటివి తయారు కాడానికి కూడా రియాక్టర్ సహకరిస్తుందని తెలిపారు. మొత్తం ఈ మార్పిడి ప్రక్రియలో కీలకమైనవి రియాక్టర్ లోని ఫోటో ఎలెక్ట్రోడ్స్.

ఈ ఎలెక్ట్రోడ్స్ ఉత్పేరకాన్ని ఉపయోగించి వ్యర్థాలను మారుస్తాయి. ప్రస్తుతానికి కార్బన్ ఆధారిత అణువులను ఉపయోగించి ఈ ప్రక్రియను చేస్తున్నామని, భవిష్యత్తులో ఉత్ప్రేరకాన్ని మార్చి సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేసేలా వ్యవస్థను రూపొందిస్తామని మరో పరిశోధకులు శుభజిత్ భట్టాచార్జి పేర్కొన్నారు. వాతావరణ మార్పులతో పోరాటం సాగిస్తున్న దేశాలకు ముఖ్యంగా వర్ధమాన దేశాలకు తాము రూపొందించిన వ్యవస్థ సహాయ పడగలదన్న ఆశాభావాన్ని పరిశోధకులు వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News