Saturday, May 4, 2024

లంచం కోసం వేధింపులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో:  డబ్బులు ఇవ్వాలని పబ్ యజమానిని వేధించిన బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్, ఎస్సై, హోంగార్డుపై ఎసిబి అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరి కలిసి రూ.4.5 లక్షలు ఇవ్వాలని బంజారాహిల్స్‌లోని రాక్‌క్లబ్ స్కై లాంజ్ పబ్బు యజమాని నేల రాజేశ్వర్ లక్ష్మణ్ రావును జూన్ 18న డిమాండ్ చేశారు. బాధితుడు డబ్బులను ఇవ్వలేకపోవడంతో తగ్గించి రూ.3 లక్షలు ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్‌రెడ్డి, హోంగార్డులు వేధింపులకు గురిచేశారు. హోంగార్డు తనకు రూ.10వేలు ఇవ్వాలని డిమాం డ్ చేశాడు. ఇన్‌స్పెక్టర్ సూచనల మేరకు హోంగా ర్డు శ్రీహరి బాధితుడికి రోజు వాట్సాప్ కాల్స్ చేసేవాడు. బాధితుడు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇన్‌స్పెక్టర్ నరేందర్ వేధించడం ప్రారంభించాడు. వెంటనే ఎస్సైని రంగంలోకి దింపి వేధిస్తున్నాడు. ఇన్‌స్పెక్టర్ ఆదేశాలతో ఎస్సై నవీన్ రెడ్డి పబ్బు యజమాని రాజేశ్వర్ లక్ష్మణ్ రావుపై ఓ తప్పుడు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా తరచూ ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి బాధితుడికి ఫోన్లు చేసి వేధించేవారు. అంతటితో ఆగకుండా బాధితుడిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి.. తర్వాత పంపించారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. తనతో పోలీసులు మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్‌లను ఎసిబి అధికారులకు అప్పగించారు. దర్యాప్తు చేసి న ఎసిబి అధికారుల ఆరోపణలు నిర్దారణ కావడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
పిఎస్‌లో విచారణ
ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్‌రెడ్డి, హోంగార్డు శ్రీ హరిని ఎసిబి అధికారులు పిఎస్ విచారణ చేశారు. అక్కడ ఉన్న కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నా రు. ముగ్గురు  నిందితులకు ఎసిబి అధికారులు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే ఇన్‌స్పెక్టర్ నరేందర్ అస్వస్థతకు గురికావడంతో ఎసిబి అధికారులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స చేయించి తిరిగి పిఎస్‌కు తీసుకుని వచ్చారు.
ఉన్నతాధికారి తప్పించుకున్నాడా….
పబ్బు యజమానిని డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఓ ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. కానీ పైఅధికారులు అతడిని ఈ కేసు నుంచి తప్పించినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన పాత్ర ఆ అధికారిది ఉన్నా ఎక్కడా అతడి ప్రస్తావన రావడంలేదు. ఆ ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News