హైదరాబాద్ : ప్రేమ పేరుతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ను వేధిస్తున్న యువకుడు ఆమెపై భౌతిక దాడికి పాల్పడిన ఘటన నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కవిత అనే యువతి హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని సాయి పద్మజా లేడీస్ హాస్టల్లో ఉంటూ ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఈక్రమంలో శశాంక్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని, తనతో కాకుండా మరెవరితోనూ మాట్లాడొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు కాగా సోమవారం రాత్రి కవిత హాస్టల్ దగ్గరకు వెళ్లిన శశాంక్ ఆమెను తీవ్రంగా వేధించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానంటూ బెదిరించి వెళ్లిపోయాడు.
తాను బెదిరించిన విషయం పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. తీవ్ర భయబ్రాంతులకు గురైన సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగిని తనను బెదిరిస్తున్న శశాంక్ను ఇలాగే వదిలేస్తే తన జీవితాన్ని నాశనం చేస్తాడని భావించి ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తాను వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్లోని ఓ కంపెనీలో పని చేస్తున్నానని ఈ క్రమంలో తనను శశాంక్ అనే వ్యక్తి వేధించడంతో పాటు యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శశాంక్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడి కోసం గాలిస్తున్నారు.