న్యూఢిల్లీ : నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ కుమార్సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను తిరస్కరించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా మంగళవారం సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని అభ్యర్థించారు. జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ధర్మాసనానికి ఆయన తన వాదన వినిపించారు. దోషి ముఖేష్ ఒక్కడినే ఒక సెల్లో దీర్ఘకాలం ఉంచలేదని, కొన్ని రోజుల పాటు మాత్రమే వేరే సెల్లో పెట్టారని చెప్పారు. దోషికి సంబంధించిన అన్ని పత్రాలు క్షమాభిక్ష కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపినట్టు తెలిపారు.
ఇటువంటి కేసుల్లో ధర్మాసనానికి జ్యుడిషియల్ రివ్యూకు సంబంధించిన అధికారం పరిమితంగా ఉంటుందని, అందువల్ల క్షమాభిక్ష నిర్ణయంలో ఆలస్యం అమానుషత్వ ప్రభావానికి దారి తీస్తుందని చెప్పారు. రాష్ట్రపతి ప్రతి విధానాన్ని పరిశీలించరని, తనకు తాను సంతృప్తి చెందిన తరువాతనే క్షమాభిక్ష గురించి ఆలోచిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పిటిషన్దారుడ్ని ఉద్దేశించి ధర్మాసనం రాష్ట్రపతి ఏమీ ఆలోచించకుండా అభ్యర్థనను తిరస్కరించారని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. దోషి తరఫున సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాష్ తన వాదన వినిపిస్తూ ముఖేష్ను జైలులో లైంగికంగా వేధించారని, కొట్టారని ఆరోపించారు. దోషికి సంబంధించిన అన్ని పత్రాలు రాష్ట్రపతికి సమర్పించ లేదని వాదించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణలో విధానాల లోపం కనిపిస్తోందన్నారు.