గాంధీనగర్: తన సొంత రాష్ట్రం గుజరాత్ గత రెండు దశాబ్దాలుగా బంగాళ దుంపల్ని పండించడం, ఎగుమతి చేయడంలో ఓ హబ్గా మారిందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం చెప్పారు. ఇక్కడ జరిగిన మూడో ప్రపంచ బంగాళ దుంపల సదస్సు సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. రైతులు కష్టపడి పనిచేయడం, ప్రభుత్వ విధానాలవల్లే ఆహార ధాన్యాలు. ఆహార ఉత్పత్తుల్లో భారతదేశం లీడర్గా మారిందని చెప్పారు. ‘గత 11-12 ఏళ్లలో దేశంలో బంగాళ దుంపల పంట 20 శాతం పెరగ్గా, గుజరాత్లో 170 శాతం పెరిగింది. విధానపరంగా ప్రభుత్వ నిర్ణయాలు, తీసుకున్న చర్యలు. నీటిపారుదల రంగంలో తగిన మేరకు ఆధునిక సదుపాయాల్ని అందించడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైంది.
సుజలాం సుఫలాం, సౌనీ యోజన వంటి పథకాలవల్ల వల్ల కరవు ప్రాంతాల్లో కూడా నీటి వసతి కలిగింది. తక్కువ సమయంలోనే విస్తృతమైన కాలువల నెట్ వర్క్ ఏర్పడింది. అది పెద్ద విజయం’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘బంగాళదుంపల ఉత్పత్తిలో గుజరాత్ ప్రయోగాన్ని గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశమంతా అమలు చేసేందుకు అనేక చర్యలు తీసుకుంది’ అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బంగాళ దుంపల ఉత్పత్తికి నూతన విధానాన్ని రూపొందించమని సదస్సుకు హాజరైన ప్రతినిధులకు మోడీ విజ్ఞప్తి చేశారు. బంగాళ దుంపల ఉత్పత్తి విషయంలో గుజరాత్ దేశంలోనే ముందంజలో ఉన్న రాష్ట్రం కనుక, బంగాళదుంపల సదస్సు ఇక్కడ జరగడమే ముఖ్యమని ప్రధాని అభిప్రాయపడ్డారు.