Saturday, April 27, 2024

సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao hoisting national flag at Siddipet

సిద్ధిపేట: 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”మహాత్ముడి స్పూర్తితో ఆసరా పెన్షన్ లతో వృద్ధులు, అభాగ్యులకు పెద్ద కొడుకులా అండగా నిలిచి.. వారి గౌరవాన్ని పెంచిన వ్యక్తి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆసరా పింఛను పథకం ద్వారా జిల్లాలో నిరుపేదలైన వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు మొత్తం అందరికి కలిపి 1 లక్ష 73 వేల 244 పించనుదారులకు ప్రతి నెల 36 కోట్ల 40 లక్షల రూపాయలు అందజేస్తున్నాం.ఈ ఆర్ధిక సంవత్సరములో ఇప్పటివరకు 3 వేల 176 స్వయం సహాయక సంఘాలకు 128 కోట్ల 27 లక్షలు రూపాయల ఋణం మంజూరు చేసాం.జిల్లాలో స్త్రీ నిధి బ్యాంకు ద్వారా ఈ ఆర్దిక సంవత్సరములో ఇప్పటివరకు 1 వేయి 31 స్వయం సహాయక సంఘాలకు 10 కోట్ల 15 లక్షల ఋణం మంజూరు చేసాం.సిద్ధిపేట మున్సిపాలిటీ లో అమృత్, టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధుల క్రింద 278 కోట్ల 50 లక్షల రూపాయలతో మూడు దశల భూగర్భ మురికి కాలువల పధకములో 80 శాతం పనులు పూర్తీ చేసాం.6 కోట్ల రూపాయలతో బుస్సాపూర్ రిసోర్సు పార్కు నందు సి ఎన్ జి బయో గ్యాస్ ప్లాంటు పనులు అతి త్వరలో పూర్తి చేస్తాం.
2 కోట్ల 20 లక్షల రూపాయలతో 20 కేఎల్ డి సామర్థ్యంతో ఎఫ్ఎస్ టిపి నిర్మాణం చేస్తున్నాం.గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో 99 కోట్ల రూపాయలతో భూగర్భ మురికి కాలువల పనులు 60 శాతం పూర్తి చేసాం.

సిద్ధిపేట పట్టణంలో వినూత్న కార్యక్రమాల తో స్వచ్చత ప్రాధాన్యత చివరి గడపకూ వెళ్ళేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.అందులో భాగంగానే స్వచ్చ బడికి శ్రీకారం చుట్టాం. సిద్ధిపేటలో రూపుదిద్దుకున్న స్వచ్ఛ బడి ఎందరినో ఆకర్షిస్తూ స్వచ్చత పాఠాలను బోధిస్తుంది. భూభాగంలో 33శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి “తెలంగాణకు హరితహారం” అనే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హరితహారంలో భాగంగా జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాం.“తెలంగాణకు హరిత హారం” కార్యక్రమం ద్వారా జిల్లాలో 2021-22 సంవత్సరములో 40 లక్షల మొక్కలు నాటుట లక్ష్యం కాగా ఇప్పటి వరకు 40 లక్షల 20 వేల మొక్కలు నాటడం జరిగింది. సిద్దిపేట జిల్లా కొత్త కలెక్టరేట్ వద్ద 210.77 హెక్టార్లలో తేజోవనము, గజ్వెల్ పట్టణము దగ్గర సంగాపూర్ వద్ద 117 హెక్టార్లలో కల్పకవనము అను (అర్బన్ పార్కు)లను అభివృద్ది చేసాం.జిల్లాలోని సహజ అడవులలో 10 వేల ఎకరాలలో రిజువినెషన్ పనులు చేపట్టి అడవుల పునర్జీవనం చేసాం. 75 వేల ఎకరాలలో మొక్కలు నాటి జిల్లాలోని అడవులన్నింటిని నాణ్యంగా మార్చి దేశములోనే సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిపాం.ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 171 కోట్ల వ్యయంతో 281 కి.మీ రహదారుల పనులు పూర్తి చేసాం.జిల్లాలో ఇప్పటి వరకు 466 కోట్ల రూపాయలతో 293 కిలోమీటర్లను రెండు వరుసలుగా రూపొందించాం. గజ్వేల్ రింగ్ రోడ్డు రేడియల్ రహదారి పనులకు నాలుగు వరుసలు అభివృద్ధి చేయుటకుగాను 396 కోట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 123 కోట్ల వ్యయంతో 26 కిలోమీటర్ల రింగు రోడ్డు చేసాం. సిద్దిపేట చుట్టూ 74 కిలోమీటర్ల రోడ్డును రెండు వరుసల “ సిద్ధిపేట రింగ్ రోడ్డు”గా నిర్మించుటకు 160 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి” అని మంత్రి పేర్కొన్నారు.

Harish Rao hoisting national flag at Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News