Saturday, April 27, 2024

హైదరాబాద్ ప్రతి రంగంలో హబ్ గా మారుతుంది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర ఆయుర్వేదిక్ వైద్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఆయుర్వేదానికి లభిస్తున్న ఆదరణకు విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయూష్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగపాణి, సమన్వయ కర్త శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ..”ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో సేవలు అందించే ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 1154 మందికి ఎంఎల్ హెచ్ పీగా అవకాశం కల్పించాం. మొత్తం 3071 మందిలో మీరు మూడో వంతు ఉన్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే, ఆయుర్వేదం ఒక్కటే భరోసాను ఇచ్చింది. ప్రభుత్వ ఆయుర్వేద ఫార్మసీ ద్వారా తయారు చేసిన జీవన్ ధార అనే ఔషధాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది.

కరోనా సెకండ్ వేవ్ లో సోకిన బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రపంచాన్ని భయపెట్టింది. మందులు కూడా లేని సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయుర్వేద కళాశాల వైద్య బృందం ఎంతో పరిశోధించి బ్లాక్ ఫంగస్ కు మెడిసిన్ ఆవిష్కరించింది. బ్లాక్ ఫంగస్ కు ఔషధం కనుగొనడం తెలంగాణలో జరగటం మనందరికి గర్వకారణం. క్వారెంటైన్ సెంటర్ గా ఆయుష్ కు సంబంధించిన 4 ఆసుపత్రులు నేచురోపతి, టిబ్బి, బీఆర్కేఆర్, హోమియో ఆసుపత్రులు విశేష సేవలందించాయి. రెండు దఫాలుగా చేసుకున్న కంటి వెలుగు కార్యక్రమంలో మీరు మంచి సేవలు అందించారు. మీ అందరికీ అభినందనలు. శుభాకాంక్షలు. వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఆయుష్ చికిత్సల్లో కూడా అగ్రస్థానంలో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.

హైదరాబాద్ లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారు. ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేలా ఎదగాలి. ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీ అందరి భాగస్వామ్యం కావాలి.సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నీ జిల్లాలకు విస్తరించే ఆలోచన సీఎం కేసీఆర్ చేస్తున్నారు. అనంతగిరి హిల్స్ లో జిందాల్ ఆయుర్వేద ఆస్పత్రిని మించి సెంటర్ ప్రారంభిస్తాం. హైద్రాబాద్ ప్రతి రంగంలో హబ్ గా మారుతున్నది. ఫార్మా రంగంలో, vaccine రంగంలో, ఐటీ రంగంలో వైద్యంలో కూడా తెలంగాణ హబ్ గా మారింది. ఇపుడు ఆయుర్వేదంలో కూడా హబ్ గా మారుతుంది. 9 ఏండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. నీతి అయోగ్ ఇండెక్స్ లో 2014లో తెలంగాణ 11 ఉంటే, ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకింది” అని తెలిపారు.

Also Read: గిట్టుబాటు గిరాకీ అయితుందా..!: రైతులతో ముచ్చటించిన మంత్రి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News