Tuesday, April 30, 2024

అన్నదాతల కండ్లలో మాకు ఆనందం కావాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రైతుల బాధలను అవహేళన చేశారని, వ్యవసాయం దండగ అంటూ చిత్రీకరించారని, కానీ ఇదే తెలంగాణ నేడు సగం దేశానికి అన్నం పెడుతుందని కలలో కూడా ఊహించిన విధంగా పంటను పండిస్తామన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని ప్రతీరైతు కళ్లలో సంతోషాన్ని నింపుతున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంతో గోదావరి జలాలను మన సిద్దిపేట జిల్లాలోని గ్రామగ్రామాన పారించుకోవడం జరుగుతుందని,  మిషన్‌ కాకతీయతో చెరువుల అభివృద్ధి సాధ్యమైందని హరీష్ రావు మెచ్చుకున్నారు. ఒక్క పంటకు కూడా అనువుగా లేని భూముల్లో రెండు పంటలను పండిస్తున్న పరిస్థితి మన జిల్లాలో ఆవిష్కృతమైందని, తెలంగాణ రాకముందు 2013వ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 79 వేల 539 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండించగా.. 2022వ సంవత్సరంలో 16లక్షల 30వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని కొనియాడారు. ఆనాడు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో కేవలం 104 కోట్ల రూపాయలను జమ చేయగా ప్రస్తుతం 15వందల 26కోట్ల రూపాయలను రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించిందని హరీష్ రావు ప్రశంసించారు. ఇటు పంట దిగుబడిలో, అటు రైతుల ఆదాయంలో పదింతల ప్రగతిని సాధించామని చెప్పడం చారిత్రాత్మకమైన విజయంగా చెప్పుకోవాలన్నారు. రాళ్లు, రప్పల భూముల రూపురేఖలు మారిపోయి పచ్చని మాగాణిల్లాగా విలసిల్లుతూ సిరుల పంటలు పండుతున్నాయని హరీష్ రావు తెలిపారు.

ఈ ప్రాంతం వాళ్ళకే కూలి పని దొరకని పరిస్థితుల నుండి ఇతర రాష్ట్రాల కూలీలకు పనులు కల్పించే స్థాయికి తెలంగాణ వ్యవసాయం అద్భుతంగా ఎదిగింది.  ఆనాటి పాలకులు వ్యవసాయానికి దొంగరాత్రి కరెంటు ఇచ్చి పంటలు ఎండబెట్టిన పరిస్థితిని కళ్లారా చూశాము. ఈనాడు 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేసి రెండు పంటలకు నీళ్లందిస్తున్న విషయం మీకందరికీ తెలుసు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు 3 వేల 13 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమచేసి రైతుబంధుగా ఈ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండేది. కానీ నేడు రైతు కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతుభీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిరాటంకంగా అమలు చేస్తున్నది. జిల్లాలో ఇప్పటికే 4 వేల 736 రైతు కుటుంబాలకు 236కోట్ల 80లక్షల రూపాయలను అందజేయడం జరిగింది. ప్రభుత్వానికి ఆర్థికభారం ఉన్నప్పటికీ, కరోనా వంటి కష్టాలతో ఆదాయం కోల్పోయినప్పటికీ ఏనాడు కూడా రైతులను నిర్లక్ష్యం చేయలేదనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఊరూరా గోదావరి జల సంబురం..

కరువుకాటకాలతో కటకటలాడిన సిద్దిపేట జిల్లా నేడు కల్పతరువుగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మన జిల్లాలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా లేదు. చెరువులు అధ్వాన్నంగా కనిపించేవి. వాగులు, చెక్‌డ్యాములను పట్టించుకున్నవాళ్లే లేరు. కానీ నేడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. గ్రామగ్రామాన గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో రంగనాయకసాగర్‌, శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, గౌరవెల్లి రిజర్వాయర్లను అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. మిషన్‌ కాకతీయ ద్వారా 2వేల131 చెరువులను అభివృద్ది చేసుకొని గోదావరి జలాలతో నింపుకోవడం జరుగుతోంది. ఆనాడు వానాకాలంలో కూడా గుక్కెడు నీటికి కటకట ఎదుర్కొన్న ప్రాంతాల్లో నేడు మండుటెండల్లో మత్తళ్లు దుంకుతున్నాయంటే అతిశయోక్తి కాదనే విషయాన్ని ప్రతీఒక్కరూ అర్థం చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News