Saturday, April 27, 2024

హరిత గోస..

- Advertisement -
- Advertisement -

పెంట్లవెల్లి : హరిత తెలంగాణే లక్షంగా ప్ర త్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాటి నుంచి ముఖ్యమత్రి కె సిఆర్ తెలంగాణ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. కానీ మండల స్థాయి అధికారుల వలన హరితహారం పథకం అపహాస్యం పాలు అవుతుంది. మొక్కల ఆలనా పాలన చూసుకోవాల్సిన అధికారులు హరిత లక్షంపై నిర్లక్షపు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలలో నర్సరీలలోనే మొక్కలు నీళ్లందక చనిపోగా నాటిన మొక్కలు ఫలాలను, పుష్పాలను అందించే దశలో అగ్నికి ఆహుతైపోతున్నాయి. కొంత మంది స్థిరాస్తి రైతులు పంట పొలాలకు ఇబ్బంది కలుగుతుందని నాటిన మొక్కలను మరుసటి రోజే పెకిలిస్తున్నారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో హరితహారం మొక్కల నిర్మూలన ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు.
మొక్కలు అగ్నికి ఆహుతైన సంఘటనలు
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రం నుంచి జటప్రోలుకు వెళ్లే ప్రధాన రహదారిపై పెంట్లవెల్లి గ్రామ పంచాయతి అధికారులు రోడ్డుకు ఇరువైపులా హరితహారం కింద నాటిన మొక్కలు పుష్పాలతో వాహనదారులను మైమరిపించే దశలో ఉండగా వేసవిలో ఎండిపోయిన గడ్డిని రైతులు నిప్పు పెట్టడంతో దాదాపు 20 నుంచి 20 మొక్కలు కాలిపోవడం జరిగింది. ఇదే మండలంలోని జటప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలకు గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి రాజేయడంతో వికసించిన గన్నేరు పుష్పాల మొక్కలు పదుల సంఖ్యలో అగ్నికి ఆహుతయ్యాయి. అదే విధంగా గోపులాపూర్ గ్రామంలో చెట్ల నీడలు పడి పంటలు రావడం లేదని రైతులు చెట్లను నరికివేయడం జరిగింది. ప్రధాన రహదారులపై మొక్కలు మంటల్లో కాలిపోతూ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ మొక్కలను సంరక్షించాల్సిన గ్రామ పంచాయతి అలసత్వం, ప్రజల బాధ్యత రహిత్యం, కొందరి స్వార్థం వలన వేలాది మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం మొక్కలు సంరక్షించాల్సి బాధ్యత గ్రామ పంచాయతీలపైనే ఉంటుంది. ప్రతి మొక్కకు 54 రూపాయల ఖర్చు చేస్తూ దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించారు. భారీ బడ్జెట్‌తో నాటిన మొక్కలను అధికారుల నిర్లక్షంతో కాల్చి వేస్తున్నారు. రోడ్ల వెంట ఎండిన పశుగ్రాసానికి అగ్గి రాజేయడం, స్థిరాస్త రైతులు చెట్లు పెరగకుండా నరకడం, రోడ్లపై ప్రమాణించే వాహనదారులు ధూమపానం సేవించి అగ్గిని అక్కడే పడేయడంతో మంటలు అంటుకుని మొక్కలు, చెట్లు కాలిపోతున్నాయి. మొక్కల మొదల్లో పిచ్చి మొక్కలు పెరిగి కూడా మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఎండిన పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఆలోచనను అమలు చేసిన వారు అవుతారని ప్రజలు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News