Sunday, April 28, 2024

తెలంగాణలో హరితహరం కొనసాగించాలి

- Advertisement -
- Advertisement -

కడియం నర్సరీలకు కెసిఆర్ అండగా నిలిచారు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే గాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం ఆమె కడియం నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడుతూ, కెసిఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలతో మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సరీలు విస్తరించి ఉండటం అభినందనీయమన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తుంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా కెసిఆర్ అద్భుతమైన హరితహారం కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఈ నర్సరీ మొక్కల ప్రత్యేకతలు వాటి పెంపకం తీరు తెన్నులను నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు, వీరబాబు, రాజశేఖర్‌లు కవితకు వివరించారు.
పలు మొక్కలను చూసి ఎంఎల్‌సి కవిత ముచ్చట పడ్డారు. వాటితో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పుల్లా చంటి నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం కూర్పును పుల్లా పెద్ద సత్యనారాయణ కవితకు చూపించారు. అలాగే పల్ల వెంకన్న నర్సరీని కవిత సందర్శించారు. ఇప్పటికే ఈ నర్సరీలో పలు రకాల మొక్కలు తమ గార్డెన్‌లో ఉన్నాయని కవిత అన్నారు. నర్సరీలో పలు విదేశీ స్వదేశీ మొక్కలను తిలకించారు. ఎంఎల్‌సి కవితకు తొలుత నర్సరీ రైతులు పల్ల సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి, వెంకటేష్, వినయ్‌లు మొక్కను ఇచ్చి ఘన స్వాగతం పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News