లక్నో: ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనోజ్ అనే హెడ్ కానిస్టేబుల్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి 2010వ సంవత్సరంలో మహిళా కానిస్టేబుల్ రేణు మాలిక్ను (33) వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఆమె కానిస్టేబుల్గా పని చేస్తుంది.
మంగళవారం లోధి రోడ్డులో కారులో మహిళ కానిస్టేబుల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై పోలీస్ రివాల్వర్ తో కాల్పులు జరిపారని, మృతదేహానికి సమీపంలో పదునైన ఆయుధాలతో పాటు రివాల్వర్ ఉందని పోలీసులు వెల్లడించారు. డౌరలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జమల్పూర్ గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ మనోజ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. భార్యను చంపి అనంతరం హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా డిసిపి అతుల్ కుమార్ పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.