హైదరాబాద్: కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణపై వాయుగుండం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రానున్న మూడురోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం భూమిపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం కర్నాటకలోని గుల్బర్గాకు 80కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయవ్య దిశగా 25కి.మీ వేగంతో కదులుతోంది. సాయంత్రానికి క్రమంగా బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ వాయవ్యంగా కదులుతూ అరేబియా సముద్రంపైకి వెళ్లనున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఎల్లుండి మళ్లీ అప్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముంది. ఈశాన్య దిశగా కదులుతూ మహారాష్ట్ర- గుజరాత్ కు దక్షిణంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రభావంతో కర్నాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో రేపట్నుంచి మహారాష్ట్ర, గోవా, కర్నాటకలో భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.