Saturday, April 27, 2024

మూడు రోజులు తెలంగాణ లో ఉరుములు మెరుపులతో వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి తూర్పు మధ్య ప్రదేశ్ నుండి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిమి ఎత్తులో విస్తరించివుంది. దీని ప్రభావంతో దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు శుక్రవారం అగ్నేయ బంగాళాఖాతం ,నికోబార్ ఐలాండ్స్ , దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాలవరకూ ప్రవేశించాయి.

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు దక్షిణ ,తూర్పు తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి జల్లులు పడ్డాయి. సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెంలో 59.3 మి.మి వర్షం కురిసింది.వికారబాద్ జిల్లా ధవల్ పూర్లో 26. ఖమ్మం జిల్లా వేంసూర్‌లో 23, నిజామాబాద్ జిల్లా లస్పల్లిలో 19.3, ముప్కల్‌లో 18.3, ఎర్‌గట్లలో 18, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో 12, ఖమ్మ జిల్లా కల్లూరులో 11.5, నల్లగొండ జిల్లా గుడాపూర్‌లో 11.3 మి.మి వర్షం కురిసింది.మిగిలిన మరికొన్ని ప్రాతాల్లో కూడా తుంపర్లు పడ్డాయి.
వీణవంకలో 45.4డిగ్రీలు
మరో వైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గలేదు. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో 45.4డిగ్రీలు నమోదయ్యాయి.నల్లగొండ జిల్లా దామచర్లలో 45.4, నిర్మల్ జిల్లా కడెం పెద్దూర్‌లో 45.1, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ జన్నారంలో 44.9, సూర్యాపేట జిలలా కీతవారిగూడెంలో 44.8, మామిళ్లగూడెంలో 44.8, కరీంనగర్‌జిల్లా జమ్మికుంటలో 44.5, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 44.5, మంచిర్యాల జిల్లా వెల్గనూర్‌లో 44.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News