మన తెలంగాణ/హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కరోనా బాధితుల సహాయం కోసం ముందుకు వచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దినసరి కూలీలు, వలస కార్మికులు ఉపాధి లేక పస్తులు ఉండక తప్పడం లేదు. ఇలాంటి వారికి తనవంతు సహాయం చేసేందుకు సానియా మీర్జా నడుం బిగించింది. వీరి సహాయం కోసం పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించే పనిలో పడింది. ఇప్పటికే దాదాపు కోటి 25 లక్షల రూపాయలను విరాళాల రూపంలో సేకరించింది. ఈ నిధుల ద్వారా జంటనగరాలు, శివారు ప్రాంతాల్లో ఉంటున్న పేదలకు భోజన సౌకర్యం కల్పించింది. దాదాపు లక్ష మంది పేదలకు భోజనం అందించాలని లక్షంగా పెట్టుకున్నట్టు వివరించింది. ఇక, తన పిలుపుకు స్పందించి చాలా మంది దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారని సానియా వివరించింది. ఇక, తాను సేకరించిన ప్రతి పైసాను నిరుపేదల ఆకలిని తీర్చేందుకు వెచ్చిస్తానని స్పష్టం చేసింది.