Tuesday, May 7, 2024

లైంగిక ఉద్దేశం లేకుండా..స్త్రీని కౌగిలించుకోవడం నేరం కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం, ముట్టుకోవడం నేరం కాదని జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్‌భూషణ్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ లోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది ఈ వాదనలు చేశారు. మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌తోపాటు మరో నిందితుడు వినోద్ తోమర్‌పై అభియోగాలు మోపాలా వద్దా? అనే అంశంపై ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. “ ఆరోపణల్లో కొన్ని సంఘటనలు భారత్ వెలుపల జరిగాయి. మూడు కేసులు మాత్రమే భారత్ కోర్టుల పరిధి లోకి వస్తాయి. అందులో రెండు అశోకా రోడ్, మరొకటి సిరి ఫోర్ట్‌కు సంబంధించినవి. సిరి ఫోర్టు కేసు కేవలం కౌగిలింతకు సంబంధించింది.

లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం, ముట్టుకోవడం నేరం కాదు” అని న్యాయవాది మోహన్ కోర్టులో వాదించారు.“ రెజ్లింగ్‌లో కోచ్‌లు ఎక్కువగా పురుషులే ఉంటారు. మహిళా కోచ్‌లు అరుదు. ఏదైనా విజయం సాధించిన సందర్భంలో ఆటగాళ్లను కౌగిలించుకుంటే , అది నేరం కిందకు రాదు. ఉత్సాహంతో ఆలింగనం చేసుకోవడం నేరం కాదు.” అని వివరణ ఇచ్చారు. ఈ కేసుపై గురువారం (ఆగస్టు 10 న )కూడా వాదనలు జరగనున్నాయి. మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై జూన్ 15న ఢిల్లీ పోలీస్‌లు ఛార్జిషీట్ దాఖలు చేశారు. నమోదైన ఆరు కేసుల్లో ఆయన వేధింపులకు పాల్పడ్డారని, ఇవి విచారించదగినవేనని పేర్కొన్నారు. ఈ కేసులో సింగ్‌తోపాటు మరో నిందితుడు తోమర్‌లకు జులై 20న ఢిల్లీ లోని మెట్రోపాలిటన్ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News