Saturday, May 4, 2024

చురుగ్గా ఎయిర్‌పోర్టు మెట్రో పనులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఎయిర్‌పోర్టు మెట్రో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎయిర్‌పోర్టు మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో వేగంగా జరిగేలా మెట్రో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నిర్మాణం పనులు ప్రస్తుతం టెండర్‌దశలో ఉన్నా, పనుల ప్రారంభం జరిగే నాటికి డిపో, ఆపరేషన్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ల ఏర్పాటుపై మెట్రో అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మెట్రోరైళ్లను నిలపడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు ఎయిర్‌పోర్టుకు అతి దగ్గరలో మరో స్థలాన్ని అధికారులు ఎంపిక చేసినట్టుగా తెలిసింది. అయితే మెట్రో అధికారులు ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్న హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతాల మధ్య, కొత్వాల్‌గూడ, శంషాబాద్‌లలో స్థల సేకరణ నిమిత్తం రెండు, మూడు స్థలాలను ఎంపిక చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఉన్న 31 కి.మీ మేర నిర్మిస్తున్న మార్గంలో మెట్రో స్టేషన్ల నిర్మాణంపై ఇప్పటికే అధికారులు ఓ స్పష్టతకు వచ్చారు. ఇంటర్నేషనల్ టెండర్‌ల గడువును జూలై 5 వరకు మెట్రో అధికారులు నిర్ణయించారు. ఈ లోగా పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించారు.

ప్రస్తుతం మెట్రో అధికారుల ప్రతిపాదిత స్టేషన్లు ఇలా..
రాయదుర్గం మెట్రో స్టేషన్ (ఐకియా ఎదురుగా) ప్రారంభ స్టేషన్, బయోడైవర్సిటీ జంక్షన్, నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్, నార్సింగి ఓఆర్‌ఆర్, తెలంగాణ పోలీస్ అకాడమి, రాజేంద్రనగర్, శంషాబాద్ ఓఆర్‌ఆర్ ఇంటర్‌ఛేంజ్, ఎయిర్‌పోర్టు కార్గో టర్మినల్, ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్‌లు.

భవిష్యత్‌లో అధికారులు ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లు..
మంచిరేవుల, కిస్మత్‌పూర్, కొత్వాల్‌గూడ, రాళ్లగూడ పేర్లు అధికారుల పరిశీలనలో ఉన్నాయి.
మెట్రో డిపోల నిర్మాణానికి పరిశీలనలో ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం…శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంగణం, హిమాయత్‌సాగర్, బుద్వేల్ ప్రాంతం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News