• హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని సూచన
  • నెలాఖరులోగా కేసులు తగ్గుతాయని వెల్లడి
న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతుండడం, హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మార్గదర్శకాలు జారీ చేసింది. హెచ్3ఎన్2 వైరస్ సీజనల్ వ్యాధి అని పేర్కొంటూ,  ఏటా రెండు పర్యాయాల్లో పలు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుంటాయని తెలిపింది.

- Advertisement -

ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ కేసులు ఈ నెలాఖరులోగా తగ్గుముఖం పడతాయని వివరించింది. అయితే, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని పేర్కొంది. జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది.

తీసుకోవల్సిన జాగ్రత్తలు: 

  • ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండడం మేలు.
  • దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కుతో పాటు నోటిని కూడా కవర్ చేసుకోవాలి.
  • చేతులతో కళ్ళు, ముక్కును పదేపదే తాకవద్దు. వైరస్ వ్యాప్తికి ఇది కారణమయ్యే అవకాశం ఉంది.
  • జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.
  • కరచాలనం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం చేయొద్దు.
  • వైద్యుల సూచన లేకుండా యాంటీబయాటిక్ మందులు వాడొద్దు.
  • సామూహికంగా కూర్చుని తినడం మానేయాలి.