Sunday, April 28, 2024

రామ్‌లల్లా విగ్రహం ఖరారు

- Advertisement -
- Advertisement -

మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం ఎంపిక

అయోధ్యలో ప్రారంభమైన క్రతువులు
150 దేశాల నుంచి తరలి వస్తున్న భక్తులు

అయోధ్య : అయోధ్యలో ఈ నెల 22న ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం ఖరారయినట్లు రామజన్మభూమి తీర్థ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం చెప్పారు.అయోధ్యలో ప్రతిష్ఠకు కర్నాటకలోని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన ప్రతిమను ఎంపిక చేసినట్లు తెలిపారు. నల్లరాయితో దీనిని మలిచారని, 150200 కిలోల బరువుంటుందని చెప్పారు. మొత్తం ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన మూడు విగ్రహాలను సిద్ధం చేయగా, యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేసినట్లు చంపత్‌రాయ్ వెల్లడించారు. అయిదేళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్నరూపంలో ఈ విగ్రహం ఉంటుందని తెలిపారు. కాగా గత 70 ఏళ్లుగా భక్తులు పూజిస్తున్న ప్రస్తుత రామ్‌లల్లా విగ్రహాన్ని కూడా కొత్త ఆలయంలోని గర్భగుడిలో ఉంచుతామని తెలిపారు. కాగా జనవరి 20, 21 తేదీల్లో అయోధ్య ఆలయానికి సాధారణ భక్తులకు అనుమతి లేదని తాజాగా చంపత్ రాయ్ చెప్పారు. 23వ తేదీనుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన బాగ్యం కల్పిస్తామని చెప్పారు.
ప్రారంభమైన క్రతువులు…
రామమందిరంలో శ్రీరాముని విగ్రహప్రతిష్ఠకు అన్ని ఏరాట్లు పూర్తయ్యాయి. మంగళవారంనుంచి ఇందుకు సంబంధించిన క్రతువులు ప్రారంభమయి 21వ తేదీవరకు నిరాఘాటంగా కొనసాగుతాయి. మంగళవారం ఆలయట్రస్టు నియమించిన ప్రతినిధి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించారు. సరయూనది ఒడ్డున ‘దశ విధ’ స్నానం, విష్ణుపూజ, గోపూజ జరిగాయి. బుధవారం(జనవరి 17న) రామ్‌లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్య చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకుని భక్తులు ఆలయానికి చేరుతారు. జనవరి 18న గణేశ్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృకా పూజ, వాస్తు పూజలతో సంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి. జనవరి 19న యజ్ఞం ప్రారంభమవుతుంది.తర్వాత ‘నవగ్రహ’,        ‘హవన్’ స్థాపన నిర్వహిస్తారు. జనవరి 20న రామజన్మభూమి గర్భగుడిని సరయూ జలాలతో శుభ్రం చేస్తారు. తర్వాత ‘వాస్తు శాంతి’, అన్నాధివాసం ఆచారాలను పండితులు నిర్వహిస్తారు.

జనవరి 21న రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22న ప్రధాన ప్రాణప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమవుతుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగూ మహోత్సవానికి150 దేశాలనుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా 7 వేల మంది ప్రముఖులకు ఆలయ ట్రస్టు ఆహ్మావనాలు పంపింది. ఇదిలా ఉండగా అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దేశం నలుమూలలకు చెందిన శాస్త్రీయ వాద్యపరికరాలను వినిపించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పఖ్వాజ్ మొదలుకొని తమిళనాడుకు చెందిన నాదస్వరం, మృదంగం వరకు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన వాద్యపరికరాలను వినిపించనున్నట్లు చంపత్‌రాయ్ చెపారు. ఎంపిక చేసిన కళాకారులు తమ ప్రాంతాలకు చెందిన వాద్య యంత్రాలను వాయిస్తారని ఆయన చెప్పారు అసంపూర్తి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ వస్తున్న విమర్శల గురించి విలేఖరులు ప్రశ్నించగా, విమర్శలకు తాను స్పందించనని రాయ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News