Friday, May 3, 2024

41 రోజుల్లో శబరిమల అయప్పస్వామి ఆలయానికి రూ. 241.71 కోట్ల ఆదాయం

- Advertisement -
- Advertisement -

గతేడాది కన్నా రూ.18.72 కోట్లు అధికం

మనతెలంగాణ/హైదరాబాద్: మండల పూజ వేళ శబరిమల అయప్పస్వామి ఆలయానికి రూ. 241.71 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. 41 రోజుల్లో ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఈ సీజన్‌తో పోలిస్తే ఈసారి రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

గతేడాది రూ.222.98 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్ అధికారులు తెలిపారు. 39 రోజుల్లోనే ఆలయ ఆదాయం రూ.200 కోట్లు దాటినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. వేలం ద్వారా రూ.37.40 కోట్లు, కానుకల రూపంలో వచ్చిన నాణాలను, నీలక్కల్ వద్ద పార్కింగ్ ఫీజులను లెక్కిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని ట్రావెన్‌కోర్ అధికారులు తెలిపారు. నగదు కానుకల రూపంలో రూ.63.89 కోట్లు, అరవన ప్రసాదం ద్వారా రూ.96.32 కోట్లు, అప్పం స్వీటు ద్వారా రూ.12.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. బుధవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. మూడు రోజుల తర్వాత డిసెంబర్ 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15వ తేదీన జరిగే మకరవిలక్కు పండుగ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News