Saturday, April 20, 2024

మూడువేలు దాటిన కరోనా కొత్త కేసులు: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు మూడు వేలకు పైనే నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 3,016 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దాదాపు ఆరు నెలల తరువాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత ఏడాది అక్టోబర్ 2 న 3,375 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,12,692 కి చేరింది. కాగా బుధవారంతో పోలిస్తే బుధవారం 2151 కేసులు నమోదు కాగా, కొత్త కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 13,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,41,68,321మంది కోలుకున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 14 మంది మృతి చెందారు.

మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు, కేరళలో ఎనిమిది మంది చనిపోయారు. దీంతో దేశంలోమొత్తం మరణాల సంఖ్య 5,30,862 గా నమోదైంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.03 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అత్యవసరంగా సమావేశం కానున్న ఢిల్లీ ప్రభుత్వం
బుధవారం ఢిల్లీలో 300 కరోనా కేసులు వెలుగు చూశాయి. గత ఏడాది ఆగస్టు 31 తరువాత, ఇంత మొత్తంలో కేసులు నమోదయ్యాయి. దాంతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. వైద్య నిపుణులు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వైద్యశాఖ అధికారులతో సమావేశ నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News