దండిగా ఔషధ ఉత్పత్తి శక్తి
వాషింగ్టన్: ప్రజలకు అత్యధిక స్థాయిలో వ్యాక్సినేషన్ల ప్రక్రియతోనే భారతదేశంలో కొవిడ్ 19 సంక్షోభానికి పరిష్కారం ఏర్పడుతుందని అమెరికా ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. త్వరితగతిన అత్యధిక సంఖ్యలో ప్రజలకు టీకాలు అందుబాటులోకి రావల్సి ఉంది. దీనితో వైరస్ వ్యాప్తి నియంత్రణ సాధ్యం అవుతుందని వెల్లడించారు. భారత్కు ఈ దిశలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని మరింతగా పెంచుకోవాలి. రెండు ఇతర దేశాల నుంచి కేవలం వ్యాక్సిన్లే కాకుండా ఇతరత్రా వైరస్ నియంత్రణ ఔషధాలను సమకూర్చుకోవల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇది భయానక వైరస్ దీనికి అంతం కేవలం ప్రజలు టీకాలతో రక్షణ పొందడమే, ప్రపంచస్థాయిలో ఇండియా ఔషధ ఉత్పత్తిలో భారీ స్థాయి రికార్డులతో ఉంది. దేశానికి ఈ దిశలో అవసరం అయిన వనరులు అనేకం ఉన్నాయి. దేశీయంగా ఉత్పత్తి పెంచుకోవచ్చు, ఇదే దశలో అవసరాన్ని బట్ట ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లను పొందవచ్చునని అమెరికా దేశాధ్యక్షులు జో బైడెన్ వైద్యసలహాదారు కూడా అయిన ఫౌచీ తెలిపారు.
తాత్కాలిక ఆసుపత్రులు అవసరం
ఇండియాలో తలెత్తుతున్న విపరీత కేసుల విషయం ఆందోళనకరం అని డాక్టర్ ఫౌచీ తెలిపారు. వెంటనే అక్కడ తాత్కాలిక క్షేత్రస్థాయి ఆసుపత్రులను ఎక్కడిక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. చైనాలో ఏడాది క్రితం ఇదే విధంగా చేశారని గుర్తుచేశారు. తాత్కాలిక చికిత్స ఏర్పాట్లు ఉన్నట్లు అయితే ప్రజలు ఆసుపత్రుల బయట పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేయగలదు. ఇక ఆసుపత్రులలో ఆక్సిజన్ లభ్యత పరిస్థితి చాలా విషమకరంగా ఉంది. ఆక్సిజన్పై చికిత్స పొందాల్సిన వారికి అది అందకపోవడం దారుణమే అవుతుంది. అయితే ఏం జరుగుతున్నదో తెలియడం లేదన్నారు.