Wednesday, May 8, 2024

భారత్‌లో హైపర్‌లూప్ రైళ్లు ఇప్పట్లో లేనట్టే : నీటి ఆయోగ్ సభ్యుడు సారస్వత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యంత వేగంతో ప్రయాణించే హైపర్‌లూప్ రైళ్లు సమీప భవిష్యత్‌లో భారత్ లోకి వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె సారస్వత్ ఆదివారం వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఈ అత్యాధునిక సాంకేతికత చాలా ప్రాథమిక దశలో ఉందన్నారు. భారత్‌లో ఈ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు కొన్ని విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వారి ప్రతిపాదనలు అంత సాధ్యం కావని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల దృష్టా ప్రస్తుతానికి ఈ హైపర్ లూప్ రైళ్లకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కేవలం అధ్యయన అంశంగా మాత్రమే పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. తొలిసారి అమెరికా లోని లాస్‌వేగాస్‌లో 2020 నవంబర్ 9న వర్జిన్ హైపర్‌లూప్ అనే సంస్థ ఈ సాంకేతికతను పరీక్షించింది. ఓ భారతీయుడు సహా కొంతమంది ప్రయాణికులు ‘పాడ్’ గా వ్యవహరించే రైలులో 500 మీటర్ల ట్రాక్‌లో గంటకు 161 కిమీ వేగంతో ప్రయాణించారు.

హైపర్‌లూప్ సాంకేతికతను బిలియనీర్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. ఒక గొట్టం లాంటి సొరంగ మార్గంలో శూన్య ప్రదేశాన్ని( గాలి సహా ఇతర ఎలాంటి పదార్థం లేని స్థలం) అభివృద్ధి చేసి వాటిలో రైళ్లను నడిపే సాంకేతికతనే హైపర్‌లూప్‌గా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా సౌకర్యం కోసం ముంబైపుణె హైపర్‌లూప్ ప్రాజెక్టును ప్రతిపాదించిందని చెప్పారు. లిథియమ్ దిగుమతుల కోసం చైనాపై ఆధారపడడంపై ప్రశ్నించగా, ప్రస్తుతం భారత్‌లో లిథియమ్ ఐయాన్ బ్యాటరీ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటోందని, అందువల్లనే చైనా తదితర దేశాలపై ఆధారపడవలసి వస్తోందని వివరించారు. అయితే మిగతా దేశాల కన్నా చైనా బ్యాటరీలు చాలా తక్కువకే లభిస్తాయని చెప్పారు. లిథియం బ్యాటరీ ఉత్పత్తి పరిశ్రమలకి భారత్ రాయితీలు ఇస్తున్న విషయం ప్రస్తావించగా, వచ్చే ఏడాది రెండు పరిశ్రమలు భారీ ఎత్తున లిథియం బ్యాటరీని ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News