నేడు బంగ్లాదేశ్తో ఢీ * మహిళల టి20 ప్రపంచ కప్
పెర్త్: మహిళల ట్వంటీ 20 ప్రపంచకప్లో భాగంగా సోమవారం భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన ఉత్సాహంతో టీమిండియా ఉండగా, పట్టుదలకు మారుపేరయిన బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారీ స్కోరు చేయకపోయినప్పటికీ లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్ అద్భుతంగా బౌల్ చేసి భారత్కు విజయాన్ని అందించింది. అయితే అన్ని సార్లు బౌలర్లు రాణిస్తే సరిపోదు. బ్యాటింగ్ కూడా రాణించాలి. అంటే హర్మన్ప్రీత్ కౌర్ సేన రేపటి మ్యాచ్లో బ్యాటింగ్లలో కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు టి20లలో అయిదు సార్లు తలపడగా భారత్ మూడు సార్లు విజయం సాధించగా, బంగ్లాదేశ్ రెండు సార్లు గెలుపొందింది.
అందువల్ల భారత్ ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు. అయితే హర్మన్ప్రీత్ మాత్రం తమ జట్టుపై పూర్తి ఆత్మ విశ్వాసంతో కనిపించారు. ఇంతకు ముందు తాము ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడే వాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమె అంటోంది. ఇక బంగ్లాదేశ్ జట్టు బలమంతా ఆల్రౌండర్ జహనారా ఆలమ్, టాప్ఆర్డర్ బ్యాట్స్మన్ ఫర్గానా హక్లపైనే ఆధారపడి ఉంది. హక్ ఇప్పటికే టి20లలో సెంచరీ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు 2018లో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్పై బంగ్లాదేశ్ విజయం సాధించడంలో హక్ కీలక పాత్ర పోషించింది. అనుభవజ్ఞురాలయిన జట్టు కెప్టెన్ సల్మా ఖటూన్ కూడా మంచి ఆల్రౌండరే.