Saturday, April 27, 2024

మహిళకు గౌరవం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను గుర్తు చేసుకునేలా ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని, రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో మార్చి 8వ తేదీ నుంచి ఈ వారోత్సవాలు జరపాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు.

వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మానాలు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా చెత్త కాంపోస్టింగ్‌కు అనువైన పద్ధతులు అనుసరించిన మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కెటిఆర్ పేర్కొన్నారు. మార్చి 8 మహిళా దినోత్సవం రోజున ప్రారంభం అయ్యే ఈ వారోత్సవాల్లో వారం రోజుల పాటు నిర్వహించాలని, అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ
ముఖ్యంగా పురపాలకలో కీలకపాత్ర వహించి వివిధ హోదాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ వారోత్సవాల్లో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు కంటివెలుగు, హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు.

ఏదైనా ఒక రంగంలో ముఖ్యంగా డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ లాంటి మొదలైన రంగాల్లో ఆదర్శవంతమైన పద్ధతుల్లో ముందుకెళ్తున్న పురపాలక సిబ్బంది, పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని సూచించారు.
మహిళా అధికారులను ఆహ్వానితులుగా….
మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించాలని కెటిఆర్ తెలిపారు. ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన మహిళలకు సన్మానించాలని ఆయన పేర్కొన్నారు. వీధి వర్తకులు మొదలుకొని మహిళా వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారిని గుర్తించాలని ఆయన సూచించారు.

అంతే కాకుండా వివిధ రంగాలకు చెందిన మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సత్కరించాలని కెటిఆర్ తెలిపారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులను, విభాగాధిపతులను, మహిళా జిల్లా కలెక్టర్‌లను, పోలీస్ ఉన్నతాధికారులను, మహిళా జడ్జిలు వంటి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి ఈ కార్యక్రమా లను నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కెటిఆర్ సూచించారు.
మహిళల కోసం స్పెషల్ బస్‌లు
మరోవైపు మహిళా దినోత్సవం రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళలు, విద్యార్థినుల కోసం టిఎస్ ఆర్టీసి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో చదివే విద్యార్థినుల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసి ప్రకటించింది.

గ్రేటర్ జోన్‌లోని 10 రద్దీ రూట్లలో 85 మహిళా స్పెషల్ సర్వీసులను ఆర్టీసి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహిళల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసి ఎండి సజ్జనార్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News