Saturday, May 11, 2024

జార్ఖండ్‌కు వెళ్లిన జెఎంఎం ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో క్యాంపు
నేడు బల పరీక్ష ఉండటంతో ప్రత్యేక విమానంలో రాంచీకి తరలింపు

మన తెలంగాణ/ హైదరాబాద్: జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడనుంది. భూకుంభకోణం కేసులో మాజీ సిఎం హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో హుటాహుటిన గత శుక్రవారం సిఎంగా ప్రమాణం చేసిన చంపై సోరెన్ విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) సారథ్యంలోని అధికార కూటమికి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రాంచికి బయలుదేరారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమానశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. వీరిని ప్రత్యేక హోటల్‌కు తరలించి సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు హాజరై చంపై సోరెన్‌కు తమ మద్దతును ప్రకటించనున్నారు. సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, తొలిరోజే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని చంపై సోరెన్ సర్కారు నిర్ణయించింది.

మనీ లాండరింగ్ కేసులో గత బుధవారం అరెస్టయిన జెఎంఎం చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన కూడా సోమవారం అసెంబ్లీ సెషన్‌లో పాల్గొననున్నారు. హేమంత్ సోరెన్‌కు ఇటీవల సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు కుట్రపూరితంగా తనను అరెస్టు చేశారని, తన అరెస్టును చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని హేమంత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాము ఈ అంశంలో జోక్యం చేసుకోబోమని, రాష్ట్ర హైకోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News