Wednesday, May 8, 2024

అనియంత్రితం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని రైతులకు పంట నిర్ణయ, విక్రయ స్వేచ్ఛ

* ఏ పంట వేసుకోవాలో ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకోవాలి ఎక్కడ అమ్ముకుంటే
   మంచి ధర వస్తుందో తెలుసుకొని విక్రయించాలి 
* రకరకాల పంటల కొనుగోలు వల్ల ప్రభుత్వానికి రూ.7500కోట్లు నష్టం వచ్చింది
* కరోనా కాలంలో గ్రామాల్లో సేకరణ కేంద్రాలు నెలకొల్పి కొనుగోలు చేశాం
* వచ్చే ఏడాది నుంచి అది సాధ్యం కాదు
* దేశ వ్యాప్తంగా అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు ఎక్కడ కావలిస్తే అక్కడ అమ్ముకోవచ్చని చెబుతున్నాయి
  -వ్యవసాయంపై ప్రగతిభవన్ విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన

50000 Govt Jobs Notification soon in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇక నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రైతులు ఏ పంట వేసుకోవాలో వారే నిర్ణయించుకోవాలని, పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలని సూచించారు. రైతుల నుంచి వివిధ రకాల పంటలు కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. మద్ధతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల నష్టం వాటిల్లిందని సిఎం పేర్కొన్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదని స్పష్టం చేశారు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని పేర్కొన్నారు.
ఆదివారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కెటి రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి ప్రవీణ్ రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎడిఎ విజయ్ కుమార్, ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి సంవత్సరం ఇదే తంతు
రైతుల నుండి మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందని అధికారులు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీని వల్ల నష్టం వాటిల్లినట్లు వారు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని వారు అభిప్రాయ పడ్డారు. కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని సిఎంకు వివరించారు. మక్కల కొనుగోళ్ల వల్ల రూ.1547.59 కోట్లు, జొన్నల వల్ల రూ.52.78 కోట్లు, కందుల వల్ల రూ.413.48 కోట్లు, ఎర్రజొన్నల వల్ల రూ.52.47 కోట్లు, మినుముల వల్ల రూ.9.23 కోట్లు, శనిగల వల్ల రూ.108.07 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోళ్ల వల్ల రూ.14.25 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇలా నికరంగా వచ్చిన నష్టంతోపాటు హమాలీ, ఇతర నిర్వహణా ఖర్చులన్నీ కలుపుకుంటే రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు చెప్పారు.

గ్రామాల్లో కొనుగోలు సాధ్యంకాదు
ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసిందన్నారు. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని.. రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదన్నారు. కొనుగోళ్లు-అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదని స్పష్టం చేశారు. కాబట్టి వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదన్నారు.

ఎక్కడైనా అమ్ముకోవచ్చు
దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే, వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలన్నారు. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్ కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలని సూచించారు. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి.. ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్‌కు సరుకులు తీసుకురావాలో నిర్ణయించాలన్నారు. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. చెప్పిన రోజు మాత్రమే సరుకును మార్కెట్‌కు తీసుకరావడం వల్ల రైతులకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

కిస్తీ సొమ్ము పెరిగింది…అయినా కొనసాగిస్తాం
రాష్ట్రంలో వ్యవసాయం బాగా విస్తరిస్తున్నది. వ్యవసాయశాఖ అనేక పనులు నిర్వహించాల్సి వస్తున్నది. వ్యవసాయ అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతులకు ప్రతిఏటా రెండుసార్లు రైతుబంధు పంటసాయం అందించే పనులను వ్యవసాయ అధికారులు చూడాలి. రైతు బీమాను పకడ్బందీగా అమలు చేయాలి. రైతు బీమా కార్యక్రమం ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుంది. వ్యవసాయ అధికారులే రైతుబీమా పథకం అమలును పర్యవేక్షించాల్సి ఉందన్నారు.

24 గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతుంది
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందేట్లు చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. కల్తీలు, నకిలీలను గుర్తించి అరికట్టాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. కొత్త వంగడాలను సృష్టించాలన్నారు. వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలన్నారు. వ్యవసాయ విస్తరణ పనులు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో సాగునీటి వసతి పెరిగినందున వ్యవసాయం కూడా బాగా పెరిగిందన్నారు.

నియంత్రిత సాగు అవసరం లేదు
రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతుంది. ఈ రైతువేదికల్లో రైతులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలి. తమ స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో అక్కడే నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదని. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలన్నారు. పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలని తెలిపారు. ఈ విధానం ఉత్తమం అని సమావేశంలో విస్తృత అభిప్రాయం వ్యక్తమైంది.

నేటి నుంచి ఆర్ధిక సహాయం షురూ…
సోమవారం నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

KCR Review Meeting on Controlled Farming 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News