Tuesday, April 30, 2024

కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్లు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. డిక్లరేషన్లు, గ్యారంటీ లంటూ ప్రజలను మభ్య పెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప ప్రజాస్వామ్య వాది అని కిషన్ రెడ్డి అన్నారు. ఆయన స్పూర్తితోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎంతో సేవ చేశారని తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని బాబు జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. జనతా పార్టీ ఆయనని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ మాత్రం దళితుల్ని ప్రధాని కాకుండా అడ్డుకుందని కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

విషప్రచారం చేసి ఆయనను ప్రధాని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన స్పూర్తితోనే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు ఎఐసిసి ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోపై కిషన్‌రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లను ముద్రించే మిషన్లు పెడతారేమోనని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముందు గత ఎన్నికల్లో యువత, మహిళా, రైతు డిక్లరేషన్ పేరుతో ఏయే గ్యారంటీలు ఇచ్చారో దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అమలు చేసి చూపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి అత్యధిక సీట్లు వస్తాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపికి సానుకూల వాతావరణం ఉందని, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా డబ్బులు ఖర్చు పెట్టినా సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు బిజెపికే వస్తాయని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News