Sunday, April 28, 2024

మూగ, చెవుడు కోసం అవసరమైన చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బోరబండ ఇబ్రహీం ఖాన్ ఇంటికి కెటిఆర్
నూతన సంవత్సరం సందర్భంగా కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపి
తన ఇంటికి రావాలని కోరిన ఇబ్రహీం ఖాన్ కుటుంబం
ఇబ్రహీం ఖాన్ పిల్లలకు ఉన్న మూగ, చెవుడు కోసం అవసరమైన చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఆదివారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెళ్లారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కెటిఆర్‌కి ట్విట్టర్ వేదికగా జనవరి 2వ తేదీన శుభాకాంక్షలు తెలిపారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ కెటిఆర్‌ను ఉద్దేశించి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు బిఆర్‌ఎస్ ఎన్నికల్లో గెలవలేదని,ఈ ఐదు సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు.

10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని ఆయన కెటిఆర్‌ను కోరారు. బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేయాలని కెటిఆర్‌ను ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీం ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపిన కెటిఆర్ తనకు అందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇచ్చిన మాట మేరకు ఇబ్రహీంఖాన్ ఇంటికి వెళ్లిన కెటిఆర్
ఇబ్రహీంఖాన్ ఇంటికి వస్తానని ఇచ్చిన మాట మేరకు ఆదివారం బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి కెటిఆర్ వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లిన కెటిఆర్‌కు ఇబ్రహీం ఖాన్ సాదరంగా కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కెటిఆర్ కార్యాలయం స్పందించి పింఛన్ మంజూరు చేయించిన విషయాన్ని కెటిఆర్‌కి ఇబ్రహీం ఖాన్ కుటుంబం గుర్తు చేసింది.

ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కెటిఆర్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ పిల్లలకు చెవుడు ఉన్నందున వారికి అవసరమైన చికిత్స ఖర్చులు అందించేందుకు కెటిఆర్ ముందుకు వచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి కెటిఆర్ వెంట స్థానిక ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఉన్నారు. కెటిఆర్ బోరబండకి రావడంతో వందలాది మంది ప్రజలు, అభిమానులు పార్టీ కార్యకర్తలు ఇబ్రహీంఖాన్ ఇంటి వద్ద గుమికూడారు.

KTR 1

KTR 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News