Sunday, April 28, 2024

నాలాలు కట్టుదిట్టం

- Advertisement -
- Advertisement -

KTR directs GHMC officials to work on nala

భారీ వర్షాలు, వరదల నుంచి
నగరాన్ని కాపాడడానికి, నాలాలు
చెరువుల రక్షణ అభివృద్ధి కోసం
అవసరమైతే ప్రత్యేక చట్టం
సమగ్ర కార్యాచరణకు జిహెచ్‌ఎంసి
ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి
కెటిఆర్ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: భవిష్యత్‌లో నగరంలో వరద కష్టాలను నివారించేందుకు నాలాల అభివృద్ధిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. నగరంలోని నాలాల విస్తరణ, అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి ప్రణాళికలను రూపొందించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో అన్ని జోన్లలో చేపట్టనున్న నాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జోనల్ అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష జరిపారు. నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాలాల విస్తరణ చేపట్టాలని మంత్రి అభిప్రాయపడ్డారు. నాలాల అభివృద్ధి కార్యక్రమంపై నగర శాసన సభ్యులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టి, వాటిని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో దశాబ్ధాలుగా నాలాలు కుంచించు పోయాయని, నాలాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తాము సమగ్ర ప్రణాళికలతో పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు. కొన్ని సంవత్సరాలుగా వర్షాలు ఒకేసారి కుండపోతగా కురుస్తున్నాయని, వీటివల్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్న నేపద్యంలో నాలాల విస్తరణ, బలోపేతం అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమంగా మారిందన్నారు. వరదల వలన భవిష్యత్‌లో నగర పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్న ప్రాథమిక ఉద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమగ్రంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నాలాల విస్తరణ వలన ప్రభావితమయ్యే పేదల విషయంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహారిస్తుందని, వీరిలో అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశం

నాలాలు, చెరువుల రక్షణ, అభివృద్ధి కోసం అవసరమైతే ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చేందుకు యోచిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. త్వరలోనే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో నాలాల విస్తరణ పైన ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి కెటిఆర్ అన్నారు. త్వరలో చేపట్టనున్న నాలాల అభివృద్ధి పైన జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో మంత్రికి వివరాలు అందించారు. ఇప్పటికే ఆయా నాలాల్లో ఉన్న అడ్డంకులు, నాలాల విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి అంశాలపైన క్షేత్ర స్థాయిలో తమ సిబ్బందితో సర్వే చేసిన నివేదిక వివరాలను జోనల్ కమిషనర్లు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమంతో సమన్వయం చేసుకొని ముందుకుపోవాలని మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు. మొదటి దశలో చేపట్టే నాలాల విస్తరణతో పాటు, ప్రతిసారి భారీ వర్షాల వలన వరదకు కారణం అవుతున్న బాటిల్ నెక్స్ ( నాలాలు బాగా కుంచించుకు పోయిన ప్రాంతాలను) గుర్తించి వాటిని విస్తరించే కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు. ఈవీడిఎం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News