Sunday, April 28, 2024

ఐటి జెట్‌స్పీడ్

- Advertisement -
- Advertisement -

మూడు రెట్లు పెరిగిన ఐటి వృద్ది
నాడు మూడు లక్షల ఉద్యోగాలు..నేడు 9 లక్షలు
సుస్థిర ప్రభుత్వం సమర్థనాయకత్వంతో అభివృద్ధి
వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తాం
మరింత అభివృద్ది చేసుకుందాం
ఐటి ప్రగతి నివేదిక కార్యకమ్రంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి రోజులతో పోలిస్తే ఐటి రంగం నేడు మూడు రెట్లు పెరిగిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామరావు తెలిపారు. సోమవారం టి హబ్‌లో ఆయన తెలంగాణ ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూసారని, వారి అంచనాలు తలకిందులు చేస్తూ హైదరాబాద్ నగరాన్ని ఐటి, ఐటి అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగినట్లు చెప్పారు. 31.44% వార్షిక వృద్ధితో రూ, 2,41,275 కోట్ల ఐటి ఎగుమతులు సాధించినట్లు చెప్పారు. గత సంవత్సరం రూ , 1,83,569 కోట్ల ఎగుమతులతో పోలిస్తే రూ, 57,706 కోట్ల పెరుగుదల ఉందన్నారు. 16.2% వార్షిక వృద్ధితో 9,05,715 ఐటి ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలిపారు.

గత సంవత్సరం వచ్చిన నూతన ఐటీ ఉద్యోగాలకు 1,26,894 అవకాశం ఏర్పడిందన్నారు. భారతదేశంలో ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం తెలంగాణ నుంచి వస్తున్నట్లు మంత్రి కెటిఆర్ చెప్పారు. 2014వ సంవత్సరం తెలంగాణ ఐటి ఎగుమతులు రూ, 57,258 కోట్ల మాత్రమే ఉంటే ఈరోజు ఇవి దాదాపు 4 రెట్లు పైగా పెరిగి రూ, 2,41,275 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పాటు నాటికి 2014లో 3,23,396 ఉద్యోగాలు ఉంటే అవి ఈరోజు మూడు రెట్లు పెరిగి 9,05,715 చేరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఐటి రంగంలో నేరుగా 5,82,319 ఉద్యోగాలు రాగా వీటికి . వీటికి మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చాయని, గత సంవత్సరం దేశ సగటు ఐటి ఎగుమతులు 9.36 శాతం ఉంటే తెలంగాణ మాత్రం అత్యంత అద్భుతంగా 31.44 శాతంతో పెరిగినట్లు తెలిపారు. 2014లో మొత్తం దేశ ఐటి ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83% గా ఉంటే నేడు కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ 27.6 శాతంగా నమోదైనట్లు తెలిపారు. దేశంలో కొత్త ఐటి ఉద్యోగాలు కల్పనలో గత సంవత్సరం 33% ఉద్యోగాలు తెలంగాణ నుంచి ఏర్పాటు అయితే అవి ఈ సంవత్సరం 44 శాతానికి పెరిగినట్లు తెలిపారు. ఈరోజు దేశ ఐటి రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు.

కేంద్రం సహయ నికారణ చేసినా
గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగామని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ ఐటి రంగానికి ఎంతగానో ఊతం ఇస్తుందనుకున్న ఐటిఐఆర్ ప్రాజెక్టుని కేంద్రం రద్దు చేసినా, ఈ ప్రగతి సాధ్యం అయ్యేలా చూడగలిగామన్నారు. అంతే కాకుండా దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా సంక్షోభం ఆ తర్వాత మారిన పరిస్థితులను కూడా దాటుకొని ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ ఐటి రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం సమర్ధనాయకత్వం వల్లే అభివృద్ధి జరిగిందని ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారకరమారావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కీలక ఐటి మరియు ఐటీ అనుబంధ పెట్టుబడులుః
ఫిస్కర్ – తన ఇండియా హెడ్ క్వార్టర్స్ ని హైదరాబాదులో ఏర్పాటును ప్రకటించంగా కాల్‌వే గోల్ఫ్‌కంపెనీ – 20,000 చదరపు అడుగులలో 200కు పైగా ఉద్యోగులతో కార్యాలయాన్ని ప్రారంభించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. క్వాల్కమ్ అమెరికా తర్వాత తన అతిపెద్ద క్యాంపస్ ని హైదరాబాదులో ఏర్పాటు చేసి సుమారు రూ , 3904 కోట్ల పెట్టుబడి పెట్టిందన్నారు. 1.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు పదివేల మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని ప్రారంభించిందన్నారు. గూగుల్ అమెరికా అవతల తన అతిపెద్ద కార్యాలయాన్ని 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేయగా, స్విస్ రే కంపెనీ హైదరాబాదులో తన ఇన్నోవేషన్ మరియు అనలిటికల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి కెటిఆర్ చెప్పారు.

జడ్‌ఎఫ్ మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన అతిపెద్ద సాఫ్ట్వేర్ హాబ్ ను హైదరాబాద్లో 5000 మంది ఇంజనీర్లతో ఏర్పాటు చేయగా ఎక్స్పేరియన్ సర్వీసెస్ నగరంలో కార్యకలాపాలు ప్రారంభించిన మూడు సంవత్సరాల్లోనే 4000మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. ఎల్‌టిఐ మైండ్ ట్రీ సంస్థ హైదరాబాద్లో డిజిటల్ ఎక్స్పీరియన్ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయగా జర్మనికి జెందిన బోష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏర్పాటు 3000 మందికి పైగా ఉద్యోగుల నియమించినట్లు చెప్పారు.మైక్రోసాఫ్ట్ మూడు కొత్త డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుందని, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అతి పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే అని తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ మూడు డేటా సెంటర్ లను దాదాపు రూ 36 వేల 300 కోట్లతో ఏర్పాటు చేయగా సైబర్ ఆర్క్ కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు.

లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయనుంది. 1000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డాజన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ని వెయ్యి మంది ఉద్యోగులతో ప్రకటించింది వచ్చే సంవత్సరం మరో 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనుందన్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ 1200 మందితో డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.జ్యాప్ కామ్ గ్రూప్ 1000 మందికి పైగా ఉద్యోగులతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుందని మంత్రి పేర్కొన్నారు. టెక్‌నిఫిమ్సీ గ్లోబల్ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్, ప్రొసీషన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి 2500 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అల్లియాంట్ గ్రూప్ విస్తరణ ద్వారా 9000 మందికి ఉద్యోగా అవకాశాలు లభిస్తాయన్నారు. విఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తన కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని హైదరాబాదులో ఏర్పాటు చేయనుందని దీని 10000 ద్వారా మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.మోన్డేహోల్డింగ్స్ సంస్థ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు 200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రైట్ సాఫ్ట్వేర్ తన నూతన డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 500 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. స్టేట్ స్ట్రీట్ తన అతి పెద్ద క్యాంపస్ ని హైదరాబాదులో ఏర్పాటు చేసిందని 5 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి అభివృద్ధి
ద్వితీయ శ్రేణి పట్టణంలో ఐటి అభివృద్దికి కృషి చేస్తున్నామని ఇందులో భాగంగా జిల్లాల్లో ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేసినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఐటి మన కళ్ళకు మాత్రమే కనిపిస్తుందని కాని జిల్లాల్లో జరిగే అభివృద్ది మనకు కనిపించదన్నారు. ఇప్పటికే వరంగల్లో టెక్ మహేంద్ర, సైయంట్, జేన్పాక్ట్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎల్‌టిఐ మైండ్ ట్రీ, జెంపాక్ట్, హెచ్‌ఆర్‌హెచ్ , హెక్సాహ్యాండ్ సొల్యూషన్స్ సంస్థలు ఈ సంవత్సరం హనుమకొండకు వచ్చినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్ ఐటి టవర్ ని మే ఆరవ తేదీన ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. తాజా అమెరికా పర్యటనలు పలు కంపెనీలతో నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండలో ఐటీ ఉద్యోగాల కల్పనకు అవగాహన ఒప్పందాలు కుదుర్చున్నట్లు తెలిపారు.దీంతో 2500 ప్రత్యక్ష ఐటి ఉద్యోగాలతో పాటు పదివేల పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో ఐటీ పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఈ నెల 15న సిద్దిపేటలో, జులైలో నిజామాబాద్, అగస్టులో నల్గొండలో ఐటీ పార్కులను ప్రారంభిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు
ఎలక్ట్రానిక్స్ రంగంలో 38వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని దీని ద్వారా 31 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని మంత్రి కెటిఆర్ తెలిపారు.అమరరాజా లిథియం అయాన్ తయారీ కేంద్రం దివిటిపల్లిలో రూ ,9500 కోట్లతో ఏర్పాటు చేయనుందని, దీని ద్వారా 4500 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. 500 మిలియన్ డాలర్లతో ఫాక్స్ కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం కొంగరకలాన్ లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రిక్స్, ఈవి వీక్ నిర్వహణ చేయడం జరిగిందని అంతేకాకుండా ఫార్ములా ఈ రేసు హైదరాబాదులో నిర్వహించినట్లు చెప్పారు.ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టీ హబ్ 2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రమని, 582000 చదురపు అడుగుల్లో నిర్మించిన ఇందులో రెండు వేల స్టార్ట్ అప్స్ ఇందులో పని చేసేందుకు అవకాశం ఉందన్నారు. హైదరాద్‌బాలోలో టి హబ్‌ను ఆదర్శంగా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఎం హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ కార్యకమంలో ఐటి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, నాస్కామ్ డైరక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్, సెజ్ డైరక్టర్ కె.శ్రీనివాస్,ఐటి సిఆర్‌ఒ అమర్‌నాథ్ రెడ్డి, ఎస్‌టిపి జాయింట్ డైరక్టర్ భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News