సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్లో అక్టోబర్ 2, 1904 న జన్మించారు. వీరి తల్లిదండ్రులు రామ్ దులరీ దేవి, శారదా ప్రసాద్. లాల్ బహుదూర్ శాస్త్రికి 7 సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించారు. చిన్ననాట ఆర్ధిక పరిస్థితి సజావుగా లేక నదిని ఈది పాఠశాలకు వెళ్ళేవారు. ఇంటి పేరు శ్రీ వాత్సవ, కులం తెలుస్తుంది అనే కారణంతో లాల్ బహుదూర్ శాస్త్రి గానే జీవించారు.
ఉన్నత విద్య వారణాసిలో ముగియగానే 17 సంవత్సరాల లాల్ బహుదూర్ గాంధీ జీ ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపుకు ఆకర్షితులైనారు. ఉద్యమంలో పాల్గొని తొలిసారి అరెస్ట్ అయ్యారు. విడుదల అనంతరం కాశీ విద్యా పీఠంలో నాలుగు సంవత్సరాల ఫిలాసఫీ కోర్సు చేసి అనంతరం 1926 లో డిగ్రీ పొందారు. అలా ‘శాస్త్రి’ డిగ్రీ అయన పేరులో ఇమిడిపోయింది. 1921 లో వీరు ‘ది సర్వెంట్స్ ఆఫ్ ది ప్యుపిల్ సొసైటీ’ లో చేరి యువకులను సమీకరించి, దేశ భక్తి ప్రబోధం చేపట్టారు. 1927 లో వీరి వివాహం లలితా దేవితో జరిగింది. విశేషమేమంటే కట్నం గా ఆయన ఓ రాట్నం, కాస్తంత నూలు తీసుకున్నారు.
తన దేశ భక్తిని సంప్రదాయంలో సైతం నిరూపించిన ఘనుడు లాల్ బహుదూర్ శాస్త్రి. 1930లో ప్రజా చట్ట ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొని, ప్రజలు పన్నులు కట్టకుండా ప్రచారం నిర్వహించినందుకు, ఆయనను బ్రిటీష్ వారు రెండున్నర ఏళ్లు జైలులో పెట్టారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం అనంతరం కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహలు ప్రారంభించింది. అప్పుడు ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. సంవత్సరం తరువాత విడుదలైన అయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరల ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాతం త్య్ర పోరాటంలో మొత్తం తొమ్మిది సంవత్సరాల పాటు జైలులోనే గడిపారు. 1945లో జైల్ నుండి విడుదలైన వీరు యుపి కేబినెట్లో పోలీస్, ట్రాన్స్పోర్ట్ మంత్రిగా చేశారు. ఆ తరువాత 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు.
1952లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాస్త్రి, నెహ్రూ మంత్రి వర్గంలో రైల్వే మంత్రిగా పని చేసి పలు సంస్కరణలు చేపట్టారు. మొదటి తరగతి, మూడవ తరగతుల మధ్య ఎక్కువ తేడాలు లేకుండా వసతి రూపకల్పనలు కల్పించారు. తాను రైల్వే మంత్రిగా పనిచేస్తుండగా 1956లో జరిగిన ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రిగా రాజీనామా చేశారు. సహచరులతో పాటు సాక్షాత్తు ప్రధాని వారించినా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు వీరు. అదే నైతిక బాధ్యత అంటే..! ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొంది రవాణా, ప్రసార శాఖల మంత్రిగా తరువాత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు.
1961లో హోమ్ శాఖ మంత్రిగా భారత్, చైనా ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో అంతర్గత భద్రతల విషయంలో ఎంతో శ్రద్ధ, చాకచక్యం ప్రదర్శించారు. 1964లో నెహ్రూ మరణానంతరం శాస్త్రి ఏకగ్రీవంగా భారత ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. 1965లో ఒకవైపు ఆహార నిల్వల కొరత, మరో వైపు పాకిస్తాన్ యుద్ధ సమస్య, ఆ సమయం లోనే జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని శంఖంలా పూరించి పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ ను గెలిపించారు. ఆనాటికి దేశం ఆహార సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్స్కి బాటలు వేశారు. రష్యా మధ్యవర్తిత్వతో తాష్కండ్లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో భారత్ పాకిస్తాన్ ఒక అంగీకారంపై సంతకం చేసి, అదే రోజు 10 జనవరి 1966న గుండె పోటుతో మృతిచెందారు. మరణానంతరం 1966లో వీరినీ భారత ప్రభుత్వం ‘భారతరత్న’ అవార్డుతో గౌరవించింది. మరణానంతరం ఈ పురస్కారం అందుకున్న వారిలో వీరే ప్రథములు.
* డా. జెవి ప్రమోద్ కుమార్- 9490833108