Sunday, April 28, 2024

కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు

- Advertisement -
- Advertisement -

Local Circles Organization Survey on corona effect on MSMEs

 

గత పదహారు నెలలుగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కరోనా ఉధృతితో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) రెండవ దశ కరోనా ధాటికి విలవిలలాడిపోయాయి. రెండు దశల కరోనా ప్రభావాన్ని తట్టుకొని ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను ప్రారంభిస్తున్న ఎంఎస్‌ఎంఇలను ఆకాశాన్నంటుతున్న ముడి సరుకు ధరలు, విపరీతంగా పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ మూలధనం కొరత వెరసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గిరాకీ లేమితో ఇబ్బంది పడుతున్న ఎంఎస్‌ఎంఇ లపై ముడి సరుకు, ఇంధన ధరల పెరుగుదల మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా తయారైంది.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇలు) పరిమిత పెట్టుబడితో, అధిక ఉత్పత్తి, ఉపాధి కల్పిస్తూ భారత దేశ ఆర్థికాభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర వహిస్తున్నాయి. 6.33 కోట్ల ఎంఎస్‌ఎంఇలు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి అనగా 11 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, దేశ జిడిపి లో 30 శాతం, పారిశ్రామిక ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతులలో 48 శాతం వాటాను కలిగి దాదాపు 8 వేల రకాల వస్తువులను తయారు చేస్తున్నాయి. మొత్తం ఎంఎస్‌ఎంఇలలో 51 శాతం వరకు గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తూ గ్రామీణ ఉపాధి కల్పనలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇటీవల లోకల్ సర్కిల్స్ సంస్థ దేశంలోని 171 జిల్లాలలోని 6 వేల స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఇల పై కరోనా రెండవ ఉధృతి ప్రభావం పై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కరోనా రెండవ దశ మహమ్మారి ప్రభావంతో రానున్న అరు నెలల్లో స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఇల వ్యాపార పరిస్థితి ఏమిటని అడగగా 37 శాతం సంస్థలు వ్యాపార కార్యకలాపాల పరిమాణాన్ని తగ్గించుకుంటాయని తెలుపగా, 14 శాతం వ్యాపారం మూసివేయబోవచ్చని, 8 శాతం అమ్మేస్తామని వెల్లడించాయి. కేవలం 22 శాతం స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఇలు మాత్రమే రానున్న రోజుల్లో వ్యాపార వృద్ధిని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాయి. అదే విధంగా 41 శాతం స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఇల వద్ద కేవలం ఒక నెలకు సరిపడా నగదు నిల్వలు మాత్రమే ఉన్నట్లు తెలిపాయి. కరోనా రెండవ దశ ప్రభావం చిన్న పరిశ్రమల మనుగడకు తీవ్ర విఘాతం కలిగించింది.

కరోనా మొదటి, రెండవ దశ ప్రభావం వ్యాపార, ఉపాధి అవకాశాలతో పాటు లాభార్జన పై తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (సిఐఎ) దేశంలోని 81 వేల స్వయం ఉపాధి సంస్థలు, ఎంఎస్‌ఎంఇలపై కరోనా మొదటి రెండవ దశ ప్రభావంపై సర్వే చేపట్టింది. ఆశ్చర్యకరంగా గత ఆర్థిక సంవత్సరంలో 78 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అసలు లాభాలనే చవిచూడలేదని సర్వే వెల్లడించింది. కరోనా రెండు దశల తీవ్ర ప్రభావాన్ని తట్టుకొని ఇటీవలే తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్న ఎంఎస్‌ఎంఇలను ఆకాశాన్నంటుతున్న ముడి పదార్ధాల ధరలు, చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరల పెరుగుదల, నగదు లభ్యత సమస్యలు, గిరాకీ లేమి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

దీనికి మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 12.94 శాతానికి ఎగబాకడం, రిటైల్ ద్రవ్యోల్బణం సైతం ఆరు నెలల గరిష్ఠమైన 6.3 శాతానికి పెరగడమే దీనికి నిదర్శనం. 170 ఎంఎస్‌ఎంఇలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎంఎస్‌ఎంఇ (ఎఐసిఎ) చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవాన్ని (27 జూన్) పురస్కరించుకొని ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పలు సమస్యలను పేర్కొన్నారు. గత సంవత్సరం పాటు వస్తువులకు డిమాండ్ లో పెరుగుదల లేకపోయినప్పటికీ ముడి పదార్ధాల ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయని, కానీ మార్కెట్లో వస్తువుల ధరల పెరుగుదలను ఆమోదించే పరిస్థితి లేనందున చాలా ఎంఎస్‌ఎంఇలు తమ వస్తువులను నష్టాలకు అమ్మవలసి రావడంతో భరించలేక పరిశ్రమలను మూసివేస్తున్నారని పేర్కొనడం గమనార్హం.

ముడి పదార్థాలు, ఇంధన ధరలు పెరగడంతో నిర్వహణ మూలధన అవసరాలు రెండింతలు పెరగడంతో పాటు ఎంఎస్‌ఎంఇల ఉత్పత్తి వ్యయం 60 నుండి 65 శాతం పెరిగిందని వాపోయారు. దీనితో పరిశ్రమలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి కార్మికుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఎంఎస్‌ఎంఇలు వినియోగించే వివిధ ముడి పదార్థాల ధరలను పరిశీలించినట్లయితే గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మైల్ స్టీల్ ప్లేట్ల ధరలు 82 శాతం, అల్యూమినియం 94 శాతం, కాపర్ 120 శాతం, పిగ్ ఐరన్ 50 శాతం వరకు పెరిగాయి. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి.

2019 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు వీటి ధరలు దాదాపు 25 -30 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ ధర 104 రూపాయలుగా, డీజిల్ ధర 96 రూపాయలుగా ఉంది. ఇంధన ధరల పెరుగుదల రవాణా ఖర్చులతో పాటు, పరిశ్రమలను నడపడానికి అయ్యే వ్యయాన్ని పెంచడంతో ద్వంద్వ ప్రభావాన్ని చూపుతుంది. ఎంఎస్‌ఎంఇలు ఎదుర్కొంటున్న మరొక సమస్య వస్తువుల తయారీకి ముందస్తుగా ఆర్డర్లు తీసుకున్నందున, ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం వస్తువులను తయారు చేసి పాత ధరలకు సరఫరా చేయడం పెను సవాలుగా మారింది. వినియోగదారులు పెరిగిన ధరలలో పది శాతం వరకు భరించడానికి సిద్ధంగా ఉన్నా అది పెరిగిన ఉత్పత్తి వ్యయంలో చాలా స్వల్పం. ఈ పెరుగుదలను వినియోగదారులు భరించడానికి సంసిద్ధంగా లేక పోవడంతో పరిశ్రమలు నష్టపోవాల్సి వస్తుంది.

ప్రభుత్వ తోడ్పాటు ఆవశ్యకం

ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను ప్రారంభిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తక్షణమే ఆర్థికంగా ఆదుకొని వాటిని పూర్వవైభవ దిశగా నడిపించాలని వివిధ పరిశ్రమ వర్గాలు ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పునరుద్ఘాటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ధరలను త్రైమాసికానికి ప్రకటిస్తూ, ధరల స్థిరీకరణను కొనసాగించాలని విన్నవించారు. వివిధ స్టీలు కంపెనీలు తమ ఉత్పత్తిలో 40 శాతం వరకు ‘స్టీల్ బ్యాంక్’ ను ఏర్పాటు చేయడం ద్వారా ఎంఎస్‌ఎంఇల కొరకు ప్రత్యేకంగా రిజర్వ్‌గా ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అధిక ధరల పెరుగుదలతో క్రితం ధరలకు సరఫరా చేయలేక ఆర్డర్లు రద్దు చేసుకొనే ఎంఎస్‌ఎంఇలను ప్రభుత్వరంగ సంస్థలు బ్లాక్ లిస్ట్‌లో పెట్టకుండా, జరిమానా విధించకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ఎలాంటి రాబడి నష్టాలు లేకుండా లీటరుకు రూ. 4.50 వరకు ఇంధన ధరలు తగ్గించవచ్చన్న ఇక్రా సూచనలను పాటిస్తూ, ఇతర సుంకాలను తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలకు ముకుతాడు వేయాలని పరిశ్రమ వర్గాలు, ప్రజలు కోరుతున్నారు.

కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసయేషన్స్ (సిఐఎ) చేపట్టిన సర్వే ద్వార ఎంఎస్‌ఎంఇలను గాడిన పెట్టడానికి పలు సూచనలు చేసింది. వీటిలో ముఖ్యమైనవి ఎంఎస్‌ఎంఇలను శాసనాత్మక చెల్లింపుల నుండి మినహాయించడం, అత్యధిక వడ్డీ భారం నుండి రక్షించడం, సులభతర రుణాల ద్వారా చేయూత నివ్వడం. అదే విధంగా స్టేట్ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసి సమయానుకూలంగా, పారదర్శకంగా వ్యవహరించడానికి తగిన అధికారాలను కట్టబెట్టి నష్టపోయిన ఎంఎస్‌ఎంఇలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి కాస్త ఉపసమనం కల్పించడానికి ఎంఎస్‌ఎంఇల జిఎస్‌టి టర్నోవర్ పరిమితి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖా మంత్రి కెటిఆర్ కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాస్తూ తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం ఎంఎస్‌ఎంఇలు లాక్ డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, 25 శాతం చిన్న పరిశ్రమలు పూర్తిగా రాబడిని కోల్పోయాయని తెలిపారు.

ఇన్నోవేటివ్ ఎంఎస్‌ఎంఇల కోసం ప్రకటించిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం మార్గదర్శకాలను విడుదల చేయాలని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ను ఎంఎస్‌ఎంఇలకు వర్తింప చేయాలని కీలక సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 6.29 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ లో భాగంగా ప్రకటించిన 1.5 లక్షల కోట్ల ఇసిఎల్‌జిఎస్ రుణాలు, 25 లక్షల మందికి రూ. 1.25 లక్షల చొప్పున అందించే రుణాలు కొంత వరకు ఊరట కలిగించే అంశాలు. వివిధ పరిశ్రమ వర్గాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని ఇటు ముడి పదార్థాలు, ఇంధన ధరల కట్టడికి, అటు ఎంఎస్‌ఎంఇలను తిరిగి గాడిన పెట్టడానికి అవసరమైన చర్యలను ప్రకటించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి బంగారు బాతు లాంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తక్షణమే ఆదుకోవడం సముచితమే!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News