ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఆ రాష్ట్ర వైద్యవిద్య, ఔషధాలశాఖ ఆధ్వర్యంలో ప్లాటినా పేరుతో ఈ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సోమవారం ప్రారంభించారు. కరోనా బాధితుల్లో తీవ్ర అస్వస్థతకు గురైనవారికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్లాస్మా థెరపీ చికిత్స అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ట్రయల్లో భాగంగా 500 మంది కొవిడ్ బాధితులకు ప్లాస్మా థెరపీ చికిత్స అందిస్తారు.
ట్రయల్లో వైద్యశాఖ కింద ఉన్న 17 కళాశాలలు, బిఎంసి కింద ఉన్న నాలుగు వైద్య కళాశాలల్లో ఈ చికిత్స అందిస్తారు. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మా సేకరించి బాధితులకు దానిని ఎక్కించడాన్నే ప్లాస్మా థెరపీగా చెబుతారు. ఈ విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి ఫలితాలు నమోదయ్యాయి. కరోనా తీవ్రత ఉన్న పేషెంట్లకు 200 ఎంఎల్ చొప్పున రెండు డోసుల ప్లాస్మాను ఉచితంగా ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే.