Sunday, May 19, 2024

రాష్ట్రంలో మహీంద్రా మరో 100కోట్ల పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

Mahindra to invest Rs 100 crore in Telangana

 

జహీరాబాద్‌లోని యూనిట్‌లో కె2 సిరీస్ ట్రాక్టర్ల
తయారీకి సంసిద్ధత మరో 1500 మందికి ఉపాధి
అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ
సహకారం అందుతోంది : మహీంద్రా ప్రకటన
అదనపు పెట్టుబడులు తెలంగాణపై వారి
విశ్వాసానికి ప్రతీక : మంత్రి కెటిఆర్ హర్షం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరో పెట్టుబడి రానున్నది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రాష్ట్రంలో అదనంగా మరో రూ.100 కోట్ల పెట్టుబడిగా పెట్టనుంది. ఇప్పటికే మన రాష్ట్రంలోని జహీరాబాద్‌లో అతి పెద్ద ట్రాక్టర్ల తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్నది. ఇక్కడే అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ మంగళవారం ప్రకటించింది. మహీంద్రా తన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కి సంబంధించి ఈ అదనపు పెట్టుబడి వినియోగించనున్నట్లు తెలియజేసింది. జహీరాబాద్ లో ఉన్న తన ట్రాక్టర్ల తయారీ యూనిట్ వద్ద కె2 సిరీస్ ట్రాక్టర్లను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నది.

కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కోసం మహీంద్రా సంస్ధ జపాన్‌కు చెందిన మిట్సుబిషి సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహించి, తక్కువ బరువుగల ట్రాక్టర్ల తయారీకి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. కే2 సిరీస్ ట్రాక్టర్లను దేశీయ మార్కెట్‌లతోపాటు అమెరికా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా వంటి అంతర్జాతీయ మార్కెట్లోనూ విక్రయించనున్నట్లు తెలిపింది. తాను రూపొందిస్తున్న ఈ కె2 సిరీస్ ద్వారా సుమారు ముప్పై ఏడు రకాల మోడళ్లను తయారు చేసే అవకాశం ఉన్నదని కంపెనీ తెలిపింది.

మహీంద్రా గ్రూప్ ప్రకటించిన అదనపు పెట్టుబడిని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు స్వాగతించారు. ఈ నూతన పెట్టుబడికి సంబంధించి మహీంద్ర గ్రూప్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మిట్సుబిషి ,మహీంద్రా భాగస్వామ్యంతో జహీరాబాద్‌లో తయారు కానున్న ఈ ట్రాక్టర్లు కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికి సంబంధించి కూడా తయారీ రంగంలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణకు భారీగా నూతన పెట్టుబడులు రావడంతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు సైతం ఇక్కడి వ్యాపార అనుకూలత, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తమ పెట్టుబడులను విస్తరించడం సంతోషంగా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు అదనపు పెట్టుబడులు పెట్టడం అంటే తెలంగాణ పట్ల వారి విశ్వాసాన్ని ప్రకటించడమేనని అన్నారు. దీనికి మహీంద్రా కంపెనీ చేసిన తాజాగా చేసిన ఈ ప్రకటన ప్రత్యక్ష నిదర్షనమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అత్యధిక ట్రాక్టర్లు అమ్ముతున్న కంపెనీగా మహీంద్ర గ్రూప్ నిలబడిందన్నారు.

ప్రస్తుతం ప్రవేశపెడుతున్న ఈ కె2 సిరీస్ ద్వారా మరిన్ని వినూత్నమైన ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ తెలిపారు. ఈ కె2 సిరీస్ ద్వారా స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్ లకు అవసరమైన ట్రాక్టర్లను తయారు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఉన్న తమ జహీరాబాద్ ప్లాంట్ లో స్ధానికులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుందని, ఇప్పటికే ప్లాంట్ కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి విశేష మద్దతు లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

2012 లో ఏర్పాటుచేసిన జహీరాబాద్ మహీంద్ర ప్లాంట్ ఇప్పటికే అత్యధిక ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్ గా నిలిచిందన్నారు. ఇప్పటికే ఇక్కడ 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నూతన పెట్టుబడి తో మరో 1500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాది లక్ష ట్రాక్టర్లను జహీరాబాద్ నుంచి మహీంద్ర ఉత్పత్తి చేస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News