మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఆర్మీ అధికారినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని మోసం చేసిన ఆనందవర్ధన్ అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజి గిరికి చెందిన ఆనందవర్ధన్ తాను ఆర్మీ ఉద్యోగినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడు.ఈక్రమంలో తానుమాజీ ఆర్మీ అధికారినంటూ నమ్మించాడు. ఎన్ఐఎ, రా, ఐబికి ఏజెంట్గా పనిచేస్తున్నట్లు సదరు యువతిని నమ్మించాడు. తనకు వివాహమైందని,అయితే ఇటీవల కాలంలో విడాకులు కూడా తీసుకున్నట్లు నమ్మించిన అనంతరం సాఫ్ట్వేర్ ఉద్యోగినిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లోని 50తులాల బంగారాన్ని చోరీ చేశాడు. దొంగలు బంగారు ఎత్తుకెళ్లారని నమ్మించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నకిలీ ఫిర్యాదు కాపీని మహిళకు చూపించాడు.
పనిమీద గోవా వెళ్తున్నానని చెప్పిన తరువాత గోవాలో తాను హత్యకు గురైనట్లు నాటకాలాడాడు. ఈ మేరకు ఆర్మీ అధికారుల పేరుతో మహిళకు మెయిల్ చేశాడు. ఆనందవర్థన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఆర్మీ అధికారుల పేరుతో ఆనంద్ మెయిల్ చేశాడు.అనుమానం వచ్చిన మహిళ అక్టోబర్ 31వ తేదీ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అతని నాటకాన్ని బయటపెట్టారు. ఆనంద్ ఇలా ఎంతమంది మహిళలను మోసం చేశాడో తెలుసుకోవడానికి అతన్ని కస్టడీలోకి తీసుకుంటామని నార్సింగి సిఐ గంగాధర్ తెలిపారు.