Tuesday, May 14, 2024

కుకీల భద్రతపై తక్షణ విచారణ కుదరదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో కుకీ వర్గీయులకు సైనిక రక్షణ కల్పించాలనే పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము ఈ విషయంలో కలుగచేసుకోలేమని తెలిపింది. మణిపూర్‌లో మే ఆది నుంచి రిజర్వేషన్ల కోటా చిచ్చు రగులుకుంటూ ఉండటంతో పలువురు ప్రాణాలు కోల్పోయ్యారు. వేలాది మంది ఇళ్లు వదిలిపెట్టి , సహాయక కేంద్రాలలో ఉండాల్సి వచ్చింది. ఈ దశలో తాము అనేక విధాలుగా దాడులకు గురవుతున్నామని మణిపూర్‌లోని కుకీ గిరిజనులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమకు సైనిక బృందాల ద్వారా భద్రత కల్పించాల్సి ఉంది. తమపై దాడులకు పాల్పడుతున్న వారిని వెంటనే విచారించి శిక్షించాల్సి ఉందని స్వచ్ఛంద సేవా సంస్థ మణిపూర్ ట్రైబల్ ఫోరం తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గాన్‌సాల్వేస్ పిటిషన్ వేశారు. ఇది కుకీల ప్రాణరక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం అయినందున దీనిపై సత్వర విచారణ జరిపించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. అయితే మణిపూర్‌లో భద్రత విషయం కేవలం శాంతిభద్రతల పరిధిలోకి వస్తుందని, దీనిపై అధికార యంత్రాంగం స్పందించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎంఎం సుందరేశన్‌తో కూడిన వెకేషన్ బెంచ్ తెలిపింది.

ఇప్పటి పరిస్థితుల్లో తమ జోక్యం మరింతగా సమస్యలను తీసుకువస్తుందని, అయినా దీనిపై వెనువెంటనే విచారణ కుదరదని తేల్చిచెప్పింది. మణిపూర్‌లో కుకీల భద్రత విషయంలో పలు చర్యలు తీసుకుంటామని అధికార రాజకీయ యంత్రాంగం పలు విధాలుగా భరోసాలు కల్పించాయని, అయితే ఇప్పటికే 70 మంది వరకూ గిరిజనులు దాడులకు గురై మృతి చెందారని, వందలాది మంది ఈ తెగవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News