ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రధాని, ఇతర మంత్రులు
సనా (యెమెన్): దక్షిణ యెమెన్ లోని ఏడెన్ విమానాశ్రయంలో బుధవారం భారీ పేలుడు సంభవించి దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కొత్తమంత్రులతో విమానం దిగిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు కారణాలేమిటో వెంటనే తెలియరాలేదు. దీనికి తాము బాధ్యులమని ఏ గ్రూపు వెల్లడించలేదు. ఈ ప్రభుత్వ విమానంలో ఎవరూ ప్రమాదానికి గురి కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే సంఘటన స్థలంలో కొన్ని మృతదేహాలు పడి ఉన్నాయని చెప్పారు. ప్రధాని మెయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్ , ఇతర కేబినెట్ మంత్రులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వారిని అధ్యక్ష ప్రాసాదానికి తరలించారు.
ఈ దాడి హోతీ తిరుగుబాటుదారుల పిరికి ఉగ్రవాద చర్యగా సమాచార మంత్రి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.విమానాశ్రయం వద్దనున్న భవనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడుకు దుస్తులు చిరిగి నేలపై పడి ఉన్న ఒక బాధితునికి మరొకరు సాయం చేస్తున్న దృశ్యం కనిపించింది. మంత్రి వర్గ ప్రక్షాళనకు సంబంధించి ప్రత్యర్థులైన వేర్పాటు వాదులతో ఒప్పందం కుదుర్చుకుని గత వారం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. వారంతా ఏడెన్కు తిరిగి విమానంలో వచ్చిన తరువాత ఈ పేలుడు జరిగింది. దేశంలో అంతర్యుద్ధం కారణంగా సౌదీ రాజధాని రియాద్ నుంచి ప్రభుత్వం కార్యకలాపాలు సాగిస్తోంది.
Massive explosion rocks Aden airport in Yemen