Wednesday, May 1, 2024

నంగునూరులో వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: వడ్లు కొనమంటే.. బిజెపి ప్రభుత్వం నూకలు బుక్కమని తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్‌ను మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. అనంతరం సామూహిక గొర్రెల షెడ్ ప్రారంభించారు. షెడ్లలో లబ్ధిదారులకు సాంప్రదాయంగా బట్టలు బహుకరించారు.

ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నంగునూరు మండల వాగు అవతలి గ్రామ ప్రజలకు మేలు చేకూరేలా దవాఖాన తెచ్చారని గుర్తు చేశారు. మండల కేంద్రమైన నంగునూరు నుంచి ఖాతా వరకూ డబుల్ లేన్ రోడ్డు వేసుకున్నామని, విద్యుత్ సబ్ స్టేషన్లు, 7 చెక్ డ్యాములతో నీళ్ల ఊటలు పెరిగాయని, మండల కేంద్రంలో ఉండే పీహెచ్ సీ గట్లమల్యాల గ్రామానికి తెచ్చుకున్నట్లు మంత్రి వివరించారు.

ఏఎన్ఏం సబ్ సెంటరులోనే తాత్కాలిక భవనం, శాశ్వత భవనానికి రూ.2కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వడ్ల బీట్ లేకపోతే ఏర్పాటు చేసినట్లు, ఈ యాసంగిలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి నంగునూరు పెద్ద వాగులో నీళ్లు నింపుతామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును వివరించారు.
గట్లమల్యాల గ్రామ అభివృద్ధి పనులు గురించి తెలిపారు. మంత్రి వెంట రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ వైస్ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, నాయకులు జాప శ్రీకాంత్ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, స్థానిక నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News