హైదరాబాద్ : బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో నాయకత్వం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నట్లుగా అగ్గి రాజుకుందన్నారు. టికెట్ రాలేదని బిజెపి ఆఫీసులో ప్రస్తుతం నాయకులు పరస్పరం అంగీలు, లాగులు చింపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కుర్చీలు గాలిలోకి ఎగురుతున్నాయని, తలలు పగులగొట్టుకుంటున్నారని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పటాన్ చెరులోని పలు ప్రాంతాల్లో టిఆర్ఎస్ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి హరీశ్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజెపి నాయకుల మధ్యే సయోధ్య లేక కొట్టుకుంటున్నారన్నారు.
అలాంటి వాళ్లు ఇంకా ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వర్షాలు పడితే బిజెపి పాలిత రాష్ట్రంలో పెద్దమొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రంలోని మోడీ సర్కార్, తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మాత్రం సవితి ప్రేమ చూపించారని ఆరోపించారు. బెంగళూరులో వరదలు వస్తే రూ.600 కోట్లు, గుజరాత్లో వరదలు వస్తే రూ. 500 కోట్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. కాని హైదరాబాద్లో వరదలు వస్తే ఎందుకు నిధులు ఇవ్వలేదో బిజెపి నాయకులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆదుకునేందుకు ముందుకు వస్తే, ఆ సాయాన్ని కూడా ఇవ్వకుండా బిజెపి అడ్డుకుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా హైదరాబాద్కు
అన్యాయం చేసిన బిజెపికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.- పెద్ద నోట్లు రద్దు చేస్తామని మోదీ ప్రకటించారని, కాని అవి రద్దయ్యాయా? అని మంత్రి హరీశ్రావు నిలదీశారు. వెయ్యి రూపాయల నోటును రద్దు చేసి, ప్రజలను రోడ్డు మీద పడేసి రెండువేల నోట్లు తెచ్చారని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల దేశ ఆర్థిక మందగమనం దిశగా దిగజారిందన్నారు. టిఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లివబుల్ సిటీగా రూపుదిద్దుకున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆరేళ్లలో నగరంలో ఎలాంటి గొడవలు లేవు. బాంబు పేళుళ్లు లేవు…మత ఘర్షణలు లేవు…కర్వూ లేదన్నారు. దీంతో ప్రజలు ఆత్మవిశ్వాసంతో, భద్రత మధ్య జీవిస్తున్నారన్నారు. హైదరాబాద్ బ్రాండ్వాల్యూ పెరగాలంటే జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ గెలవాలన్నారు.
Minister Harish Rao in GHMC election campaign