Tuesday, April 30, 2024

అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao launches ambulances

హైదరాబాద్: వెంగల్ రావు నగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అంబులెన్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. ఈ రోజు రెండు అంబులెన్స్‌లు ప్రారంభించుకున్నాం. ఇందుకు స‌హ‌క‌రించిన ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ వారికి కృత‌జ్ఞ‌త‌లు. మరో 8 అంబులెన్సులను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సీఎస్ఆర్ కింద వీటిని స‌మ‌కూర్చ‌డం సంతోష‌క‌రమన్నారు. ముఖ్యమంత్రి కెసిఅర్ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఆస్ప‌త్రుల‌కు చేర్చే 108 అంబులెన్స్ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేసుకున్నాం. వాటి సంఖ్య‌ను 430కి పెంచుకున్నాం. కాలం చెల్లిన‌, పూర్తిగా చెడిపోయిన వాహ‌నాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ర్తీ చేసుకుంటూ సేవ‌ల‌కు అంత‌రాయం లేకుండా చూసుకుంటున్నామని పేర్కొన్నారు.

ప‌ట్ట‌ణ, గ్రామీణ ప్రాంతాల్లో స‌గ‌టున 15-20 నిమిషాల్లో అంబులెన్స్ సేవ‌లందుతున్నాయి. ఈ స‌మ‌యాన్ని మ‌రింత త‌గ్గించేందుకు ల‌క్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. త‌క్ష‌ణ వైద్యాన్ని అందించేలా ఈ అంబులెన్సుల్లో బేసిక్ లైఫ్ స‌పోర్టు వ్య‌వ‌స్థ ఉండ‌గా, అత్య‌వ‌స‌ర వైద్యం అందించి ఆసుప‌త్రికి చేరే లోగా ప్రాణాలు కాపాడే అడ్వాన్స్‌డు లైఫ్ స‌పోర్టు సిస్టం క‌లిగిన అంబులెన్స్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 2021 నుంచి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు నాలుగున్న‌ర ల‌క్ష‌ల మందికి సేవ‌లు అందించ‌డం జ‌రిగింది. ఎమ‌ర్జెన్సీ మెడిక‌ల్ స‌ర్వీస్ మీద ప్ర‌జ‌ల్లో మ‌రింత విశ్వాసం క‌లిగించేందుకు, అంబులెన్స్ వెళ్ల‌లేని ప్రాంతాల‌కు సైతం వెళ్లి వైద్య సేవ‌లు అందించాల‌న్న ల‌క్ష్యంతో 50 బైక్ అంబులెన్స్‌ల‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది. మారుమూల గిరిజ‌న ప్రాంత వాసుల కోసం ఐటీడీఏ ప‌రిధిలో, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌, రంగారెడ్డి ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఇవి సేవ‌లందిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న 25 అంబులెన్సులు ప్ర‌తి నెల స‌గ‌టున 750 ఎమ‌ర్జెన్సీ కేసుల‌కు సేవ‌లందిస్తున్నాయి. ఏప్రిల్ 2021 నుంచి ఈ ఏడాది పిబ్ర‌వ‌రి వ‌ర‌కు దాదాపు 19వేల మందికి ఈ 50 బైక్ అంబులెన్స్ సేవ‌లందాయని మంత్రి వెల్లడించారు.

దీంతో పాటు మారు మూల పల్లెల నుండి గ‌ర్భిణుల‌ను ఆసుప‌త్రుల‌కు, తిరిగి ఇంటికి చేర్చేందుకు 300 అమ్మ ఒడి వాహ‌నాల‌ను ఏర్పాటు చేసుకున్నాం. 2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 38ల‌క్ష‌ల మంది గ‌ర్బిణులు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి వాహ‌నాల ద్వారా సేవ‌లు పొందారు. గ‌తంలో ఎవ‌రైనా ద‌వాఖాన‌ల్లో మ‌ర‌ణిస్తే.. ఆ పార్థీవ దేహాల‌ను సొంతూళ్ల‌కు తీసుకువెళ్ల‌డం పెద్ద స‌మ‌స్య‌గా ఉండేది. ఈ క‌ష్టాన్ని, వేద‌న‌ను మ‌న‌సుతో అర్థం చేసుకున్న ప్ర‌భుత్వం.. పార్థీవ దేహాల‌ను త‌ర‌లించేందుకు 50 ప‌ర‌మ‌ప‌ద వాహ‌నాల‌ను ఏర్పాటు చేసింది. అవ‌సాన ద‌శ‌లో ఉన్న వారికి వైద్య సేవ‌లు అందించేందుకు గాను దీనికి అద‌నంగా 30 ఆల‌న వాహ‌నాల‌ను ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని రకాల వాహనాలు ఏర్పాటు చేయడమే కాదు.. వాటి సేవలు నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగేలా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News