Sunday, April 28, 2024

సిగ్గుచేటు

- Advertisement -
- Advertisement -

ఐటిఐఆర్ రద్దు ప్రకటన మంత్రి కెటిఆర్ భగ్గు

ఐటిఐఆర్ స్థాయి ప్రాజెక్టులు తెలంగాణకు
ఇచ్చామనడం పచ్చి అబద్ధం దానికి
సమానస్థాయి ప్రాజెక్టులు ఇవ్వాలని
50సార్లు కోరినా కేంద్రం స్పందన కరవు
బిజపి డిఎన్‌ఏలోనే అసత్యాలను కేంద్ర
మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అలవోకగా
వల్లెవేశారు ఇకో సిస్టంకు నయా పైసా
సాయం అందించలేదు ఐటిఐఆర్ రద్దుతో
రాష్ట్రానికి జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలి

మన తెలంగాణ/హైదరాబాద్: ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటి శాఖ సహాయ మం త్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తీవ్రం గా ఆక్షేపించారు. సంకుచిత రాజకీయాల కో సమే కేంద్రం ఐటిఐఆర్ రద్దు చేసిందని ఆయ న మండిపడ్డారు. ఐటిఐఆర్ స్థాయిలో రాష్ట్రాని కి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పా ర్లమెంట్‌లో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి, దేశ ప్ర జలను మోసం చేసిందని మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి పార్టీ డిఎన్‌ఏ లో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారని కెటిఆర్ విమర్శలు గుప్పించారు.

రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి తెలంగాణకు మోడీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటి పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కొల్పొయిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటి పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసింది ఏమీలేదన్నారు. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌లో ఐటిఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరిగానే హైదరాబాద్ ఐటిఐఆర్‌ను కూడా మూలకుపెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను ఐటిఐఆర్ గురించి అడిగామన్నారు. ఎన్నిసార్లు కోరినా తోలుమందం కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు.

కనీసం 50 సార్లు కేంద్రాన్ని కోరాం

మోడీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని గుర్తించినంకనే ఐటిఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటికి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరామని కెటిఆర్ అన్నారు. అయినా కూడా మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటి ఇకోసిస్టమ్‌కు నయా పైసా సహాయం చేయలేదని విమర్శించారు. కేంద్రానికి హైదరాబాద్ ఐటి పరిశ్రమ అభివృద్ధిపైన చిత్తశుద్ధి లేకనే ఐటిఐఆర్‌కు ప్రత్యామ్నాయం చూపలేదని మండిపడ్డారు.

ఐటిఆర్‌ఆర్ ప్రాజెక్టు కనుక ఉండి ఉంటే…

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్ విధానాలతోనే గందరగోళాల వల్ల ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశ సగటును మించిన అద్భుతమైన ప్రగతిని రాష్ట్ర ఐటి పరిశ్రమ సాధించిందని కెటిఆర్ తెలిపారు. ఒకవేళ ఐటిఐఆర్ ప్రాజెక్టు కనుక ఉండి ఉంటే ఈ ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటి ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా ఎంతో అద్భుతంగా ఎదిగేదన్నారు.

రాజకీయ కోణంలో ఆలోచించే ప్రాజెక్టును రద్దు చేసింది

హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్టుకు తాము చేస్తున్న ధోఖాను కప్పిపుచ్చుకునేందుకు బిజెపి గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మోడీ ప్రభుత్వం, రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న ఏకైక కారణంతోనే ఐటిఐఆర్‌ను రద్దుచేసిందని విమర్శించారు. ఆధునిక భారత్ ను నిర్మించడంపై తమకున్న విధానపర అశక్తతను పార్లమెంట్‌లో ఒప్పుకుని రాష్ట్ర ఐటి గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు, యువతకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు. దీంతో పాటు ఐటిఐఆర్ రద్దుతో ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలన్నారు.

బిజెపి ప్రభుత్వం తెలివి తక్కువ తనానికి నిదర్శనం

కేంద్రంలోని వివిధ శాఖలు ప్రవేశ పెట్టిన స్మార్ట్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్‌లను రాష్ట్రానికి మంజూరు చేసినందుకే ఐటిఐఆర్ ను రద్దు చేశామని కేంద్రం చెప్పడం వారి ఇంటలెక్చువల్ బ్యాంకురప్టసీ (తెలివి తక్కువ తనం)కి నిదర్శనమని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కనీసం ఐటిఐఆర్ రద్దుకు కేంద్రం పేర్కొంటున్న అనేక పథకాల్లలోనూ రాష్ట్రానికి దక్కింది ఏదీలేదన్నారు. ఐటి పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలను చూపి రద్దు చేయడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికున్న విధానపరమైన నిబద్ధతకు
నిదర్శనమన్నారు.

బిజెపి ప్రభుత్వాలకు ఫుల్…తెలంగాణకు నిల్

బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ లకు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ తెలంగాణకు వస్తున్న చారానా ఆఠానా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఐటిఐఆర్ కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటి పరిశ్రమకు మోడీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నా….

రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై ఇక్కడి ప్రజలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నా… ప్రధాని మోడీలో చలనం రావడం లేదని కెటిఆర్ విమర్శించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న రాష్ట్ర ఐటి రంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈమధ్యనే ప్రకటించిన సాఫ్ట్‌వేర్ పార్క్‌లే సాక్ష్యమన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాలకు సాఫ్ట్‌వేర్ పార్క్ లను కేటాయించిన కేంద్రం, రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ విషయంలోనూ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందనలేదన్నారు. దేశవ్యాప్తంగా 22 సాప్ట్‌వేర్ పార్కులను ప్రకటించి రాష్ట్రానికి మెండిచేయి చూపడం బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమన్నారు.

కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు

ఐటిఐఆర్, సాప్ట్‌వేర్ పార్కుల్లో తెలంగాణకు స్ధానం ఇవ్వని కేంద్రం, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టి…హాబ్-2 నిర్మాణాన్ని రూ. 450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం అందలేదని కెటిఆర్ పేర్కొన్నారు. యువతకు ఉపాది కల్పించే విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ముందుచూపు లేదని విమర్శించారు. యువతకు ఉపాదికల్పణ,శిక్షణ రంగాల్లో కేంద్రం విఫలం అయిన విషయాన్ని దేశంలోని యువత, నిరుద్యోగులు గమనిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇలా రాష్ట్రానికి ఐటితో పాటు అన్ని అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం విధానాలను ఇక్కడి యువత గమనించాలని కోరారు. మరోపైపు కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ, వివక్ష చూపుతున్న ఉపాధి కల్పనలో రాష్ట్రానికి ముందువరుసలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇప్పటికైనా దేశ ఐటి రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న రాష్ట్ర ఐటి రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటిఐఆర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి రాష్ట్రం పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News