Tuesday, May 7, 2024

ప్రీతి కేసులో నిందితులెవరైనా వదిలిపెట్టం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాళ్లు సైఫ్ అయినా, సంజయ్ అయినా, ఎవరైనా సరే వదిలిపెట్టమని, చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో సోమవారం రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెటిఆర్ ప్రసంగించారు. ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలపై చిల్లరమల్లర మాటలు మాట్లాడటం సరికాదని కెటిఆర్ హెచ్చరించారు.

వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి దురదృష్టావశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై చనిపోయిందని, ఆ అంశాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డామని, మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎంపి మాలోతు కవితలు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిం చారని మంత్రి తెలిపారు. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నానని కెటిఆర్ పేర్కొన్నారు. కొంతమంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ తాము ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News