Sunday, April 28, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2018లో ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని పిటిషన్ లో రాఘవేంద్రరాజు పేర్కొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ను మళ్లీ వెనక్కి తీసుకుని దాన్ని సవరించి అందజేశారని తెలిపారు. ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌ను కొట్టేస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది. దీంతో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన తరుణంలో శ్రీనివాస్ గౌడ్ కు భారీ ఊరట లభించినట్టయింది.

చివరికి న్యాయం , ధర్మమే గెలిచింది : శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ పిటిషన్‌పై హైకోర్ట్ మంగళవారం తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పనిగట్టుకుని తనపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారని.. చివరికి న్యాయం, ధర్మమే గెలిచిందని మంత్రి చెప్పారు. తన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని.. మళ్లీ గెలుపు తనదేనని, ప్రజలు తనవైపే వున్నారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రజలకు మరింత సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News