మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పరిస్థితులపై కరీంనగర్లో ఉండే ఎంపి బండి సంజయ్కు ఏం తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అవగాహన లేని బిజెపి నేతల బాష చూస్తుంటే ఇవి ఎన్నికలా? విద్వేషాల ప్రచారాలా? అనేది అర్ధం కావడం లేదని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. సాధారణ సమయంలో ప్రభుత్వాన్ని అనేక సార్లు మెచ్చుకున్న నేతలే ప్రస్తుతం టిఆర్ఎస్ను విమర్శించడం ఎంత వరకు సబబు అని మంత్రి ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఆయన బుధవారం తెలంగాణ భవన్లో ఎంఎల్సి శ్రీనివాసరెడ్డి, ఎంఎల్ఎ దానం నాగేందర్లతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ..తాను, దానం నాగేందర్లు ఇక్కడే పుట్టి పెరిగామని, తమకు హైదరాబాద్ జీవన విధానం, సంస్కృతి, పరిస్థితులన్నీ పూసగుచ్చినట్లు తెలుసని పేర్కొన్నారు.
కానీ ఎక్కడో ఉండే బండి సంజయ్, ఇంకొందరు బిజెపి నేతలు అవగాహన లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని తెలిపారు. సిటీలో 40 వేల రోహింగ్యాలున్నట్లు బిజెపి నేతలు మాట్లాడుతున్నారని, ఒక వేళ అది నిజమైతే కేంద్ర ఇంటిలిజెన్స్, అమిత్షా ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ చెస్తారో? తెలియని పరిస్థితుల్లో బండి సంజయ్ ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. కావున అది దేశ సరిహద్దుల్లో మాత్రమే చేస్తారనే విషయాన్ని ఇప్పటికైనా బిజెపి పార్టీ తెలుసుకుంటే మంచిదని, లేదంటే ప్రజల ముందు నవ్వులపాలు కావాల్సి వస్తుందని మంత్రి తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో ఉండే కిషన్రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో ఇక్కడి అభివృద్ధికి రూ. 5 లక్షలైనా తెచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. వరదల్లో ప్రజలు బాధ పడుతుంటే కిషన్రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అ శాంతిని కోరుకునే బిజెపి నేతల అనుచిత వ్యాఖ్యాలపై హైదరాబాద్ ప్రజలు క్షుణ్ణంగా ఆలోచించాలన్నారు. వరద బాధితులకు రూ.25 వేలు ఇస్తామని ప్రచారం చేస్తున్న బిజెపి కేంద్రం నుంచి వెంటనే జి.వోను విడుదల చేయాలన్నారు.
బిజెపి, ఎంఐఎం మైండ్ గేమ్ ఆడుతున్నాయి
బిజెపి, ఎంఐఎం పార్టీలు మైండ్గేమ్ ఆడుతున్నాయని మంత్రి తలసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వాన్ని పడకొట్టే శక్తి వారికి ఎక్కడదని ఆయన చెప్పారు. అంతేగాక కేంద్ర మంత్రులుగా ఉన్న ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీలు వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నగరాల గురించి మాట్లాడుకుంటే బెటర్ అని, వాళ్లకి హైదరాబాద్లో ఏం పని అని ఆయన తెలిపారు. ఒక్క నయా పైసా కూడా ఇవ్వని కేంద్రం జిహెచ్ఎంసి ఎన్నికలపై దృష్టి పెట్టడంపై మతలబు ఎమిటో ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు.
వరద సాయం అందినట్లు నేను నిరుపిస్తా..దానం నాగేందర్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో వరద సాయం అందినట్లు తాను నిరూపిస్తానని, కావాలంటే ఎంపి అరవింద్ వచ్చి చూసుకోవాలని ఎంఎల్ఎ దానం నాగేందర్ సవాల్ విసిరారు. టిఆర్ఎస్ను దేశ ద్రోహుల పార్టీ అంటున్న అరవింద్కు వాళ్ల తండ్రి ఏ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారో? తెలియదా? అని దానం గుర్తుచేశారు. అంటే కన్నతండ్రిని కూడా ఆయన దేశ ద్రోహిగా వర్ణిస్తున్నారని ఎంఎల్ఏ దానం నాగేందర్ వివరించారు.