పాకిస్థాన్కు భారత్ ఘాటు హెచ్చరిక
న్యూయార్క్ : పాకిస్థాన్ ఐరాస ప్రకటిత ఉగ్రవాదులు అనేకులకు ఆశ్రయం కల్పిస్తోందని, ఇది అనుచితం అని భారతదేశం హెచ్చరించింది. ప్రపంచ స్థాయి ఉగ్రవాదులకు చోటు కల్పించడం, నిషేధిత సంస్థలకు వేదికగా నిలవడం వంటి పరిణామాలతో ఈ దేశం అబోటాబాద్ ఘటనను గుర్తు తెచ్చుకుంటే మంచిదని భారతదేశం హితవు పలికింది. అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అబోట్టాబాద్లో ఏడాది పాటు తలదాచుకుని తరువాతి క్రమంలో హతుడు అయిన విషయాన్ని భారతదేశం తెలియచేసింది. ఐరాసలో భారత శశ్వత రాయబారి టిఎస్ తిరుమూర్తి అత్యంత కీలకమైన ట్వీట్లో పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టారు. ఓ వైపు ఉగ్రవాదులకు ఊతం ఇస్తూ వస్తోన్న పాకిస్థాన్ మరో వైపు దీనిని బుకాయిస్తూ కట్టుకథలతో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్కు డోసియర్లు అందిస్తోందని విమర్శించారు.
ఐరాసలో పాకిస్థాన్ దూత వివరణను తిరుమూర్తి తప్పుపట్టారు. కల్పిత పత్రాలు, అబద్ధాలను ప్రచారం చేయడం పాకిస్థాన్కు బాగా అబ్బిన విద్య అయిందని, ఇది కొత్తేం కాదని విమర్శించారు. పాకిస్థాన్ దుష్టబుద్దులు మానుకోవడం లేదని, ఈ విషయం తిరిగి ఇటీవలి పరిణామంతో రుజువు అయిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగాలా సోమవారం ప్రముఖ దేశాల ప్రతినిధులకు తెలియచేశారు. ఈ నెల 19వ తేదీనే జమ్మూలోని నగ్రోటాలో పాకిస్థాన్ కేంద్రపు ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహమ్మద్ పన్నిన భారీ ఉగ్ర దాడిని భద్రతా బలగాలు ముందుగానే పసికట్టి తిప్పికొట్టినట్లు వివరించారు. అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఐరాస దూతలతో విదేశాంగ కార్యదర్శి భేటీ అయి పాకిస్థాన్ కుట్రలను తెలియచేశారు.