Sunday, April 28, 2024

తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: పార్లమెంట్‌లో తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన పిఎం మోడీ తెలంగాణకు వస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. తెలంగాణ అంటేనే విషం చిమ్మే వాళ్లు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాకు ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో అడుగుపెట్టే అర్హత మోడీకి లేదని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా సంగతేంటని సూటిగా శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

ముచ్చటగా మూడుసార్లు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రధాని ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ గడ్డపై అడుగు పెట్టాలని శ్రీనివాస్ నిలదీశారు. కులం మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రశాంతంగా ఉన్న పాలమూరును అల్లోకల్లోలం చేసేందుకు వస్తున్నారా? అని అడిగారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగిన సందర్భంలో ఇకపై ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వబోమని పార్లమెంటు సాక్షిగా చెప్పిన పిఎం మోడీ, వెంటనే తెలంగాణకు ఎగువన ఉన్న కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ఇచ్చారని శ్రీనివాస్ ప్రశ్నించారు.  ఈ గడ్డపై కాలు పెట్టేముందు ప్రధానమంత్రి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసిన బిసి, ఎస్సి తదితర బిల్లులకు ఆమోదం తెలపాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న కృష్ణా జలాల పంపిణీ కూడా త్వరగా పూర్తిచేయాలని కోరారు.

మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్ రెడ్డి, రాములు, ఎంపిపి బాలరాజు, తిరుపతి రెడ్డి, లక్ష్మణ్, తదితరులు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

Also Read:  తెలంగాణకు పరిశ్రమలు తరలిపోవడంపై జగన్ సర్కార్‌పై బ్రాహ్మణి ఫైర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News