Thursday, May 2, 2024

తెలంగాణపై మోడీ ప్రభుత్వం కుట్రలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ఆర్ధిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది
రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోంది
ప్రతిపక్షాల కుల రాజకీయాలను ప్రజలు నమ్మరు
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Modi Govt conspiracy on Telangana

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కావాలని తెలంగాణ రాష్ట్రం పై కుట్రలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్న మిగిలిన రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోందని విమర్శించారు. బుధవారం నల్లగొండలో ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడారు. రాష్ట్రానికి సహజసిద్ధంగా రావాల్సిన నిధులు రాకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర బిజెపి నాయకులు మాత్రం తెలంగాణ పరువు పోయేలా మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

కేంద్రం ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ అన్యాయంగా వ్యవహరిస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం లో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని, అందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఇవ్వాళ కులాల మీద మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి రావాలన్నదే… దోచుకోవాలన్నదే ప్రతిపక్షల లక్ష్యమని, అధికార యావ తప్ప వారికి వేరే ప్రాధాన్యం లేదని విమర్శించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ లో నాబార్డ్ రుణాల లో కూడా ఆంధ్ర ప్రాంతానికి దోచుకొని పోయారని గుర్తు చేశారు. రైతు బంధు ద్వారా ఇవ్వాళ అందరికి ప్రభుత్వం సంక్షేమం అమలు చేస్తున్నదని గుత్తా తెలిపారు. ప్రజలు ఎప్పుడు కుల రాజకీయాలను నమ్మరని అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకే ఓట్లు వేస్తారని చెప్పారు.

స్వప్రయోజనాల కోసం కులాలను వాడుకోవడం దుర్మార్గంమని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే కెసిఆర్ ముఖ్యమంత్రి అయిండు కాబట్టే ఇంత అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తారాకు మాదిరి తయారయ్యేది అని గుర్తు చేశారు. తెలంగాణ కు ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీరామ రక్ష అని ప్రజలు ప్రతిపక్షాలు మాయ మాటలు నమ్మొద్దని కోరారు. ఖమ్మం జిల్లాకు చెందిన పార్థసారథి రెడ్డి హెటిరో ఫార్మాతో దేశ విదేశాల్లో కంపెనీలు పెట్టి దేశ అభివృద్ధి కి పాటు పడ్డారని వివరిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ పార్థసారథి కి రాజ్యసభ ఇవ్వడం హర్షణీయమన్నారు. విభజన చట్టం లోని అంశాలను అమలు చేసేలా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News